నేనో రాజకీయ హింసా బాధితుణ్ని.. దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ
ABN , Publish Date - May 31 , 2026 | 04:20 PM
సోనార్పూర్లో తనపై జరిగిన దాడిని టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఖండించారు. తనపై జరిగిన దాడిని రాజకీయ హింసగా అభివర్ణించారాయన.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్లో తనపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. బీజేపీ నేతలే తనపై దాడికి పాల్పడ్డారని.. ఆ పార్టీ రాజకీయ హింస, బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు అభిషేక్ బెనర్జీ.'రాహుల్ జీ.. మీ మద్దతుకు ధన్యవాదాలు. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య సంస్థలను పరిరక్షించడానికి, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను నిలబెట్టేందుకు చేసే పోరాటంలో మనం ఐక్యంగా, దృఢంగా నిలబడదాం' అని బెనర్జీ పేర్కొన్నారు.
విదేశాలలో భారత్కు ప్రాతినిధ్యం వహించడంలో తన పాత్రను వివరిస్తూ.. ఆపరేషన్ సిందూర్ సంబంధిత అఖిలపక్ష ప్రతినిధి బృందంలో భాగంగా తాను 5 దేశాలలో పర్యటించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడానని ఈ సందర్భంగా అభిషేక్ అన్నారు. 'జాతీయవాద సంరక్షకులమని చెప్పుకునే వారు ప్రయోగించిన రాజకీయ హింసకు, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి నేడు నేను బాధితుడినయ్యాను' అని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను, అసమ్మతివాదులనే బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ఆ పార్టీకి మద్దతిచ్చిన వాళ్లనే దేశభక్తులుగా భావిస్తారని, వారికి వ్యతిరేకంగా ప్రశ్నించినవారిని లక్ష్యంగా చేసుకుంటారన్నారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా తాను ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తానని ఆయన స్పష్టం చేశారు.
బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సొరేన్పూర్లో టీఎంసీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై కొందరు వ్యక్తులు దొంగ దొంగ అని అరుస్తూ దాడికి పాల్పడ్డారు. చొక్కా చించివేయడం సహా ఆయనపై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. పోలీసులు రంగంలోకి దిగి ఆయనకు హెల్మెట్ పెట్టి సురక్షిత ప్రదేశానికి తరలించారు. అయితే.. బీజేపీ నేతలే తనను చంపాలనుకుంటున్నారని, అందుకే కుట్రపూరితంగా దాడి చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. కాగా.. అభిషేక్ ఆరోపణల్ని బీజేపీ తోసిపుచ్చింది.
ఇవీ చదవండి:
వృద్ధుడిని చుట్టేసిన పాము.. నాలుగు గంటల నరకం..
పశ్చిమ బెంగాల్లో మరో ఘటన.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి