టాటూ... నొప్పికి టాటా!
ABN , Publish Date - Aug 23 , 2026 | 10:53 AM
టాటూ వేయించుకోవాలని అనుకుంటారు కానీ... నొప్పికి భయపడి కొందరు వెనక్కి తగ్గుతారు. అలాంటి వారికి బ్రిటన్లోని ఓ స్టార్టప్ శుభవార్త చెప్పింది.
టాటూ వేయించుకోవాలని అనుకుంటారు కానీ... నొప్పికి భయపడి కొందరు వెనక్కి తగ్గుతారు. అలాంటి వారికి బ్రిటన్లోని ఓ స్టార్టప్ శుభవార్త చెప్పింది. నొప్పిలేని టాటూ సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది.
బ్రిటన్కు చెందిన స్టార్టప్ సంస్థ ‘సైఫర్ ఎక్స్’ ప్రపంచంలోనే తొలిసారిగా నొప్పిలేని టాటూ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీని సాంకేతికత అతి సూక్ష్మ సూదులపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ సూదులు చర్మంలో చాలా తక్కువ లోతులోకి మాత్రమే ప్రవేశిస్తాయి. సైఫర్ ఎక్స్ సంస్థ సీఈఓ ఫెర్డినాండ్ కోల్కు సూదిని చూస్తే భయం. ఆ భయంలో నుంచే ఈ టాటూ సాంకేతికత పుట్టుకొచ్చింది.
సైజు చిన్నదే అయినా....
నొప్పిలేని టాటూ విధానంలో సూక్ష్మ నిర్మాణాలు కలిగిన చిన్న ప్యాచ్లో రంగును ఉంచి చర్మంపై అమర్చుతారు. ప్రత్యేక అప్లికేటర్ సహాయంతో ప్యాచ్ను అమర్చి... సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచుతారు. మొదట డిజైన్ చాలా మసకగా కనిపిస్తుంది... నెమ్మదిగా 24 గంటల్లో స్పష్టమవుతుంది. ఇది చూడటానికి తాత్కాలిక టాటూ స్టిక్కర్లా కనిపిస్తుంది. కానీ శాశ్వతంగా ఉండిపోయే టాటూ ఇది.
దీన్ని తొలగించాలంటే సాధారణ టాటూల మాదిరిగానే లేజర్ చికిత్స అవసరం. అయితే ఈ విధానంలో పెద్ద సైజులో టాటూ వేయడం సాధ్యం కాదు. కేవలం 15 మి.మీ వృత్తం సైజులో మాత్రమే టాటూ వేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం నలుపు రంగు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే హార్ట్ సింబల్స్, ఎమోజీలు వంటి చిన్న డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నొప్పిలేని విధానంలో పెద్ద టాటూలు కావాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీశైలం జలాశయానికి 50,161 క్యూసెక్కులు రాక
Read Latest AP News And Telangana News And International News And Telugu News