పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. చమురు ధరలకు రెక్కలు!
ABN , Publish Date - Jun 03 , 2026 | 10:27 AM
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేపట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇటీవల క్షిపణి దాడులు జరగ్గా.. వాటికి తామే బాధ్యులమని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) తాజాగా ప్రకటించింది. ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపంపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు టెహ్రాన్ పేర్కొంది. తమ వాయుసేన బలగాలు.. అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడులు జరిపినట్టు ఐఆర్జీసీ వెల్లడించింది. తమ దేశంపై ఎలాంటి చర్యలకు దిగినా బలమైన ప్రతి దాడులుంటాయని ఇరాన్ సైన్యం వాషింగ్టన్ను హెచ్చరించింది.
అయితే.. ఇరాన్ చేపట్టిన దాడులతో తమకు పెద్ద నష్టమేమీ జరగలేదని అమెరికా, కువైట్ దేశాలు తెలిపాయి. ఇరాన్ నుంచి దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ వాయుసేన అడ్డుకుందని కువైట్ పేర్కొంది. అలాగే.. ఇరాన్ క్షిపణుల్లో ఏ ఒక్కటీ తమను చేరలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. మరోవైపు.. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఘర్షణలూ మరింత తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్లోని అల్-మర్వానియేపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం. ప్రతిగా సరిహద్దు సమీపంలో హెజ్బొల్లా చేపట్టిన డ్రోన్ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు.
కాగా.. ప్రపంచంలో ప్రధాన చమురు రవాణా మార్గాలలో ఒకటైన హోర్ముజ్ జలసంధి.. ఈ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కూ రూబియో స్పందిస్తూ.. ఇరాన్తో జరుగుతున్న చర్చలు టెహ్రాన్ అణు కార్యక్రమానికి సంబంధించినవి మాత్రమేనని, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి కాదన్నారు. మరోవైపు.. ఈ జలమార్గంలో సుదీర్ఘ అంతరాయంతో ప్రపంచ చమురు దిగుమతి వ్యయాలు 20 బిలియన్ డాలర్లకు పెరగొచ్చని, ఫలితంగా పేద దేశాలు మరింత నష్టపోతాయని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా.. గల్ఫ్లో పెరుగుతున్న అనిశ్చితి కారణంగా చమురు ధరలు మరోసారి ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 97 డాలర్లకు పైగా పెరగగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్కు 95 డాలర్లకు చేరువైంది. ఈ ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశముందని వ్యాపార రంగాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇవీ చదవండి:
ఇరాన్ సుప్రీం లీడర్ జీవించే ఉన్నారు.. అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన!
జపాన్లో మసీదు నిర్మాణం.. పాక్ కమ్యూనిటీకి రాయబార కార్యాలయం హెచ్చరిక