Share News

ట్రంప్, జిన్‌పింగ్ డిన్నర్ కార్యక్రమంలో టాప్ టెక్ లీడర్లు

ABN , Publish Date - Sep 19 , 2026 | 09:36 AM

ఏఐ రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అత్యాధునిక ఏఐ అభివృద్ధికి అవసరమైన చిప్‌లను చైనాకు అందకుండా చేయడం ద్వారా ఆ దేశ పురోగతిని అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ ట్రంప్, జిన్‌పింగ్ సమావేశంలో ఏఐ సాంకేతికతకు సంబంధించి ఏదైనా ఒక అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి.

ట్రంప్, జిన్‌పింగ్ డిన్నర్ కార్యక్రమంలో టాప్ టెక్ లీడర్లు

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వనున్న డిన్నర్ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు దిగ్గజ టెక్ కంపెనీల అధినేతలు కూడా పాల్గొననున్నారు. ఎన్‌విడియా హెడ్ బాస్ జెన్సెన్ హువాంగ్, ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్‌మన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, యాపిల్ హెడ్ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ డిన్నర్ ఈవెంట్‌కు హాజరు కానున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అమెరికా అధికారి తెలిపారు. ఏఐ రంగంలో అమెరికా, చైనా రెండు ప్రధాన శక్తులుగా ఎదుగుతున్న నేపథ్యంలో ట్రంప్, జిన్‌పింగ్ నేతల మధ్య జరిగే చర్చల్లో ఏఐ కీలక అంశంగా మారనుంది. ఈ తరుణంలో దిగ్గజ టెక్ కంపెనీల అధినేతలు ఈ భేటీకి హాజరు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఆవిష్కరణల వేగవంతంవైపే కంపెనీలు

ఏఐపై అమెరికాలో జరుగుతున్న చర్చల్లో ప్రస్తుతం ఒక అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్, మెటా వంటి ప్రముఖ ఏఐ కంపెనీలు తమ ఆవిష్కరణల వేగాన్ని తగ్గించకూడదని భావిస్తున్నాయి. ఆవిష్కరణల విషయంలో నెమ్మదిగా వెళ్తే, అత్యాధునిక ఏఐ రంగంలో అమెరికాను చైనా దాటిపోయే అవకాశం ఉందని దిగ్గజ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. కొంతకాలంగా అత్యాధునిక ఏఐ విషయంలో అమెరికా కన్నా వెనుకబడి ఉందని భావిస్తున్న చైనా.. ఇప్పుడు ఆ అంతరాన్ని చాలా వేగంగా తగ్గిస్తోంది. అత్యాధునిక ఏఐ అభివృద్ధికి అవసరమైన అధునాతన చిప్‌లను చైనాకు అందకుండా చేసి చైనా వేగాన్ని అడ్డుకోవడానికి అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఎన్‌విడియా తయారు చేసే అత్యున్నత స్థాయి సెమీకండక్టర్ చిప్‌లు చైనాకు అందకుండా అమెరికా జాగ్రత్తలు తీసుకుంది. ఇక అమెరికా, చైనా మధ్య ఏఐ విషయంలో తీవ్రమైన పోటీ ఉన్నా.. ఈ రెండు దేశాల అధినేతలు సమావేశమైనప్పుడు ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా ఒక అంశంపై ఒక ఒప్పందానికి రావచ్చని సమాచారం.


ఇవీ చదవండి:

‘సెమీకాన్‌ 2.0’తో రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు

టాటా వాణిజ్య వాహన ధరలు పెంపు

Updated Date - Sep 19 , 2026 | 09:54 AM