అమెరికాలోని దారుణం.. భార్య, ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భర్త..
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:41 AM
అమెరికాలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. జార్జియా రాష్ట్రంలో లారెన్స్ విల్లే సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ పౌరుడు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా(America)లోని జార్జియా(Georgia)లో భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. అట్లాంటా(Atlanta) సమీపంలోని లారెన్స్విల్ నగరంలో నలుగురు కాల్పుల్లో చనిపోవడం పెను సంచలనంగా మారింది. భర్త తన భార్యతో సహా ముగ్గురు బంధువులను దారుణంగా కాల్చి చంపాడు. భర్త ఉన్మాదిగా మారి ఇలా ప్రవర్తించడానికి కుటుంబ కలహాలే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణ(Preliminary inquiry)లో తేలింది.
ఈ ఘటనలో చనిపోయిన వారు డోగ్రా(43), గౌరవ్ కుమార్ (33), నిధి చందర్(37), హరీష్ చందర్ (38)గా గుర్తించినట్లు గ్విన్నెట్ కౌంటీ(Gwinnett County) పోలీసులు తెలిపారు. నిందితుడు విజయ్ కుమార్ (51) కాల్పులు జరుపుతున్న సమయంలో ముగ్గురు చిన్నారులు బెడ్ రూమ్ అల్మరాలో దాక్కొని ప్రాణాలు రక్షించుకున్నారని తెలిపారు. బయట తుపాకీ శబ్దం, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు వినిపిస్తున్నా బిక్కుబిక్కుమంటూ ఊపిరి బిగబట్టి అక్కడే దాక్కున్నారని చెప్పారు.
'కాల్పుల అనంతరం చిన్నారుల్లో ఒకరు ఎమర్జెన్సీ నంబర్ 911కి కాల్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు విజయ్ కుమార్పై హత్య, హత్యాయత్నం, పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు వారి బంధువుల సంరక్షణలో ఉన్నారు' అని గ్విన్నెట్ కౌంటీ పోలీసులు తెలిపారు. మరోవైపు అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేసింది. నిందితుడిని అరెస్టు చేశారని, మృతుల కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నామని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News