ఆ గ్రామం ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటుంది మరి!
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:31 PM
సాధారణంగా ఓ గ్రామం ఏదేని ఒక పంచాయతీలో గానీ, లేదా ఒక శాసనసభ నియోజకవర్గంలోగానీ ఒక లోక్సభ నియోజకవర్గంలో గానీ వుంటుంది.
చెన్నై: సాధారణంగా ఓ గ్రామం ఏదేని ఒక పంచాయతీలో గానీ, లేదా ఒక శాసనసభ నియోజకవర్గంలోగానీ ఒక లోక్సభ నియోజకవర్గంలో గానీ వుంటుంది. కానీ ఒక గ్రామం నాలుగు పంచాయతీలు, 2 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో వుందన్న విషయం మీకు తెలుసా?.. అయితే కోయంబత్తూరు జిల్లా కరుమత్తంబట్టి సమీపంలోని పొన్నాండంపాళయం వెళ్దాం రండి. ఇక్కడ 300 కుటుంబాలు నివశిస్తున్నాయి. స్థానికుల్లో అధికభాగం వ్యవసాయకూలీలుగా, ఫ్యాక్టరీ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ గ్రామంలో ఏడు వీధులు మోపిరిపాళయం పట్టణ పంచాయతీ, కనియూరు, ఆరసూరు, నారాయణపురం గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయి.
గ్రామంలో 200 ఇళ్ళలో 650 మంది ఓటర్లు నివసిస్తున్న ప్రాంతం కనియూరు పంచాయతీ పరిధిలో ఉంది. కొన్ని ఇళ్లు అరసూరు పంచాయతీ పరిధిలో, మరికొన్ని ఇళ్ళు అవినాశి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని అన్నూరు, నారాయణపురం పంచాయతీ పరిధిలో ఉన్నాయి. 30 ఇళ్లు మాత్రం మోపిరిపాళయం పట్టణ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ గ్రామంలో కొంత భాగం అవినాశి అసెంబ్లీ నియోజకవర్గం, నీలగిరి(Neelagiri) లోక్సభ నియోజకవర్గం పరిధిలోను ఉంది.
తక్కిన ప్రాంతమంతా సూలూరు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా రెండు పోలింగ్కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామం ఒకటే అయినా రెండు అసెంబ్లీ అభ్యర్థులకు ఓటేసే అదృష్టం తమకే దక్కిందంటూ ఈ ఊరి వాసులు సరదాగా మాట్లాడుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పది మంది కోసం ఓ పోలింగ్ కేంద్రం !
Read Latest Telangana News and National News