ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు! చైనా నిర్ణయంతో ప్రకంపనలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:20 PM
మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తునట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ముడి చమురు సరఫరాలో అవాంతరాలతో ఇక్కట్ల పాలవుతున్న ప్రపంచదేశాలకు కొత్త సమస్య వచ్చి పడేటట్టు ఉందన్న భయాలు నెలకొన్నాయి. ఎరువుల ఎగుమతుల్లో ప్రపంచంలో నెం.2గా ఉన్న చైనా వీటి ఎగుమతులపై ఆంక్షలకు సిద్ధమైంది. ఎగుమతుల్లో కోత పెట్టాలని చైనా ఆర్థిక ప్రణాళిక సంస్థ ఎన్డీఆర్సీ దేశీయ సంస్థలకు సూచించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జెట్ ఫ్యుయెల్, డీజిల్, కిరోసిన్ల ఎగుమతులను తగ్గించాలని గత నెలలో ఎన్డీఆర్సీ సూచించింది. దేశీయ ఇంధన, ఆహార అవసరాల కోసం చైనా ఎగుమతులపై ఆంక్షలు విధిస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
చైనా ఎరువులు ఆస్ట్రేలియా, వియత్నాం వంటి దేశాలతో పాటు భారత్కూ ఎగుమతి అవుతుంటాయి. కొన్ని దేశాలకు ఎగుమతులను నిలిపివేయాలని తమకు ఆదేశాలు అందాయని షాండాంగ్ ప్రావిన్స్లోని ఒక ఫర్టిలైజర్ సంస్థ అధికారి పేర్కొన్నారు. అయితే, ఈ ఆంక్షల విషయమై చైనా ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఎగుమతులకు బ్రేకులు తప్పవని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు చైనా అన్ని చర్యలు తీసుకుంటుందని అంటున్నాయి.
ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ డేటా ప్రకారం, ఎరువుల ఎగుమతుల్లో రష్యా నెం.1 కాగా రెండో స్థానంలో చైనా ఉంది. జెట్ ఫ్యుయెల్ ఎగుమతి చేసే దేశాల్లో చైనా ఆరవ స్థానంలో ఉంది.
ఈ వార్త చదవండి:
యుద్ధ ట్యాంకుపై ఉత్తర కొరియా అధ్యక్షుడు! టీనేజ్ కూతురితో పాటూ..
అమెరికాకు సైనిక స్థావరాలు ఇవ్వకండి.. ప్రాంతీయ దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి