రెండు వేర్వేరు కేసుల్లో రూ. 4 కోట్లకు పైగా టోకరా!
ABN , Publish Date - Jun 02 , 2026 | 08:24 AM
అధిక లాభాలు వస్తాయని నమ్మించి, కస్టమర్ ఫిక్స్డ్ డిపాజిట్లను ముందుగానే రద్దు చేయించి మోసానికి పాల్పడిన ఘటనలో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఓ ప్రైవేట్ బ్యాంకు మాజీ మేనేజర్తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేయించి ఒకరికి.. ఇళ్లు తాకట్టు పెట్టించి మరొకరికి వల
బ్యాంకు మాజీ మేనేజర్ సహా పలువురిపై కేసు
హైదరాబాద్ సిటీ: అధిక లాభాలు వస్తాయని నమ్మించి, కస్టమర్ ఫిక్స్డ్ డిపాజిట్లను ముందుగానే రద్దు చేయించి మోసానికి పాల్పడిన ఘటనలో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఓ ప్రైవేట్ బ్యాంకు మాజీ మేనేజర్తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కొండాపూర్లో నివాసం ఉంటున్న బాధితురాలికి గచ్చిబౌలిలోని ఓ బ్యాంకులో సుమారు రూ.1.5 కోట్ల పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు ఉన్నాయి. అప్పటి బ్రాంచ్ మేనేజర్ ఆదిత్యన్ పతతిల్ ఆమెతో ఫిక్స్డ్ డిపాజిట్లు ముందుగానే రద్దు చేయించి, తన పరిచయస్తుడు వేణుగోపాల్రెడ్డి అనే వ్యక్తి ఖాతాకు డబ్బులు బదిలీ చేయించాడు.
మేనేజర్ మాటలను నమ్మిన బాధితురాలు.. 2024లో విడతల వారీగా రూ.1.5 కోట్లు వేణుగోపాల్ రెడ్డి ఖాతాకు బదిలీ చేసింది. వేణుగోపాల్ రెడ్డి ఆమెతో ట్రేడింగ్ పేరుతో మరో రూ.30.50 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టించాడు. అదే సమయంలో మేనేజర్ వ్యక్తిగత అవసరాల పేరుతో బాధితురాలి నుంచి రూ.20 లక్షల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు. భద్రత కోసం వారు ఇచ్చిన చెక్కులు, ఒప్పంద పత్రాలు ఉన్నప్పటికీ, ఆ తర్వాత చెక్కులన్నీ బ్యాంకుల్లో వరుస తిరస్కరణకు గురయ్యాయి. నిందితులు కొంతమొత్తాన్ని మాత్రమే తిరిగి చెల్లించి, మిగిలిన కోట్లాది రూపాయల సొమ్మును ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.3 కోట్ల రుణం పేరుతో..
మరో కేసులో రూ.3 కోట్ల రుణం ఇప్పిస్తామని నమ్మించి.. దంపతుల ఇళ్లను తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా, యజమానులకు తెలియకుండా బ్యాంకు నుంచి రూ. 2.20 కోట్ల భారీ రుణం పొందారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గోపాల్నగర్లోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో 2 ఫ్లాట్లను కొనుగోలు చేసిన దంపతులు, రూ.3 కోట్ల అప్పు కోసం ప్రైవేట్ ఫైనాన్షియర్ల్లను సంప్రదించారు. ఈ క్రమంలో సురేష్ పంచారియా, చంద్రశేఖర్రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వారికి పరిచయం అయ్యారు. లోన్ ఇచ్చేందుకు తాత్కాలిక భద్రత పేరిట ఇళ్లను తమ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధి దిలీప్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మించారు.
దీంతో ఆ దంపతులు తమ 2 ఇళ్లను దిలీప్ పేరిట రిజిస్ట్రేషన్ చేయగా, వారికి రూ. 1.20 కోట్లు మాత్రమే చేతిలో పెట్టారు. నాలుగు నెలల తర్వాత బ్యాంకు ప్రతినిధులు ఇంటి చిరునామా కోసం వచ్చినప్పుడు అసలు విషయం బయటపడింది. తమకు తెలియకుండా దిలీప్ అనే వ్యక్తి, తమ ఇళ్ల ఆధారంగా రూ. 2.20 కోట్ల గృహ రుణం తీసుకున్నట్లు బాధితులు గుర్తించారు. ఈ మోసంలో కొంతమంది బ్యాంకు ఉద్యోగులు కూడా ప్రమేయం ఉన్నట్లు ఓ సీనియర్ బ్యాంకు అధికారి అంగీకరించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మోసాలపై గచ్చిబౌలి, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు కాగా, నేరాల తీవ్రత దృష్ట్యా.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈవోడబ్ల్యూ వింగ్కు బదిలీ అయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా..
Read Latest AP News And Telangana News And International News And Telugu News