హైటెన్షన్ టవర్ ఎక్కిన ప్రియుడు
ABN , Publish Date - Apr 23 , 2026 | 08:19 AM
ప్రేయసితో పెళ్లి జరిపించాలని పెట్రోల్ డబ్బాతో ఒక యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కాడు. బోరబండ పోలీసులు అతడితో మాట్లాడాక కిందికి దిగాడు.
ప్రియురాలితో పెళ్లి చేయాలని డిమాండ్
మోతీనగర్ చౌరస్తాలో కొద్ది గంటలపాటు నాటకీయ పరిణామం
హైదరాబాద్: ప్రేయసితో పెళ్లి జరిపించాలని పెట్రోల్ డబ్బాతో ఒక యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కాడు. బోరబండ పోలీసులు అతడితో మాట్లాడాక కిందికి దిగాడు. ఈ సంఘటన మోతీనగర్ చౌరస్తాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నెల్సన్ రాజ్ (25) నగరంలోని ఒక ఫార్మసీలో అసిస్టెంట్. ఇక్కడే పనిచేస్తున్న బోరబండకు చెందిన యువతితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్ని నెలల క్రితం వరకు వారిద్దరూ అల్లాపూర్ ప్రాంతంలో ఉండేవారు.
తనను వేధిస్తున్నాడని, కాపాడాలని నెలరోజుల క్రితం ఆ యువతి బోరబండ ఠాణాలో నెల్సన్ రాజ్పై ఫిర్యాదు చేసింది. అతడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి.. కేసును అల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ క్రమంలో బుధవారం మోతీనగర్ చౌరస్తాలోని హైటెన్షన్ టవర్ ఎక్కి.. చేతిలో పెట్రోల్ డబ్బాతో నెల్సన్ రాజ్ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు.
సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఇక్కడకు చేరుకొని సెల్ ఫోన్లో ప్రేయసితో పెళ్లి చేస్తామని నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. అప్పటికే డోలో 650 టాబ్లెట్లు మింగిన అతడిని చికిత్స నిమిత్తం మోతీనగర్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నెల్సన్ రాజ్పై కేసు నమోదు చేస్తామని ఇన్ స్పెక్టర్ సురేందర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News