Share News

9న కైలాసగిరిపై త్రిశూలం ఆవిష్కరణ

ABN , Publish Date - May 06 , 2026 | 01:09 AM

కైలాసగిరిపై నిర్మించిన త్రిశూలం, ఢమరుకాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ మంగళవారం ప్రకటించారు.

9న కైలాసగిరిపై త్రిశూలం ఆవిష్కరణ

విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి):

కైలాసగిరిపై నిర్మించిన త్రిశూలం, ఢమరుకాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ మంగళవారం ప్రకటించారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌భరత్‌, సీఈ వినయకుమార్‌, ఇతర అధికారులతో కలిసి కైలాసగిరిని సందర్శించారు. త్రిశూలం, ఢమరుకం, అక్కడి ప్లాట్‌ఫారం, ఇతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ ప్రాంతం చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని, ఆకర్షణీయమైన మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.


పెందుర్తి ఎంపీడీవో సస్పెన్షన్‌

‘స్వచ్ఛ రథం’ కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించడంతో చర్యలు

పెందుర్తి, మే 5 (ఆంధ్రజ్యోతి):

‘స్వచ్ఛ రథం’ కార్యక్రమ నిర్వహణలో అలసత్వం వహించారన్న కారణంతో పెందుర్తి ఎంపీడీవో జి.అప్పలరాజును ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం.కృష్ణతేజ రెండు రోజుల క్రితం మండలంలోని ఎస్‌.ఆర్‌.ఫురం, వాలిమెరక గ్రామాలను సందర్శించారు. జలధార-జలహారతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో స్వచ్ఛరథం కార్యక్రమ నిర్వహణలో ఎంపీడీవో తీరుపై కమిషనర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్‌, ఇతర పొడి చెత్తను స్వీకరించి, వాటికి బదులుగా నిత్యావసర వస్తువులు అందించడం, తద్వారా పల్లెలను పరిశుభ్రంగా ఉంచడం, ‘సంపద సృష్టి’ అనేవి స్వచ్ఛరథం కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఇందులో ఎంపీడీవో నిర్లక్ష్యంగా ఉన్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలియడంతో ఆయన్ను సస్పెండ్‌ చేయాలని కమిషనరర్‌ కృష్ణతేజ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జెడ్పీ సీఈవో నారాయణమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. ఈవోఆర్డీ కామేశ్వరరావుకు ఇన్‌చార్జి ఎంపీడీవో బాధ్యతలు అప్పగించారు.


వారాంతపు రైలుగా విశాఖ-బెంగళూరు ‘స్పెషల్‌’

విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం-బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించి శాశ్వత ప్రాతిపదికన వారాంతపు ఎక్స్‌ప్రెస్‌లుగా అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (18509) ఈ నెల 10 నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.50 గంటలకు బెంగళూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18510) ఈనెల 11 నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుతుంది.

Updated Date - May 06 , 2026 | 01:09 AM