Share News

యువకుడి ఆత్మహత్యాయత్నం.. సంచలనంగా సెల్ఫీ వీడియో

ABN , Publish Date - Jun 25 , 2026 | 08:08 AM

విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని మద్దిలపేట గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

యువకుడి ఆత్మహత్యాయత్నం.. సంచలనంగా సెల్ఫీ వీడియో
Bheemili Suicide Attempt Case

విశాఖపట్నం జిల్లా, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని మద్దిలపేట గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారానికి సంబంధించి తనపై దాడి జరిగిందని మనస్థాపానికి గురైన సురేశ్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన సెల్ఫీ వీడియోను రికార్డ్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది.


సెల్ఫీ వీడియోలో సురేశ్ పలు ఆరోపణలు చేశాడు. తన ప్రేమ వ్యవహారంలో కాళ్ల వెంకట్రావు (KVR) జోక్యం చేసుకుని తనపై దాడి చేశారని పేర్కొన్నాడు. అలాగే తాను వైసీపీ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాననే కారణంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించాడు. కొందరు వైసీపీ అనుచరులు కలిసి తనను టార్గెట్ చేశారని వీడియోలో చెప్పాడు. అయితే తన ప్రేమ వ్యవహారానికి కాళ్ల వెంకట్రావుకు ఎలాంటి సంబంధం లేదని కూడా సురేశ్ ఆ వీడియోలో ప్రస్తావించాడు. కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ విషయాలను ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


ఆత్మహత్యాయత్నం అనంతరం సురేశ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సురేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వచ్చే 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణలు, ప్రేమ వ్యవహారం, దాడి జరిగిన పరిస్థితులు, రాజకీయ కోణం వంటి అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. భీమిలిలో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 08:14 AM