ఏపీలో భారీ ఆపరేషన్.. అలుగును విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Jan 30 , 2026 | 08:32 PM
నెల్లూరు జిల్లాలో అత్యంత అరుదైన, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా గుట్టును అధికారులు రట్టు చేశారు. కోట్లాది రూపాయల విలువైన అలుగును విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు..
నెల్లూరు జిల్లా, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో అత్యంత అరుదైన, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా గుట్టును అధికారులు రట్టు చేశారు. కోట్లాది రూపాయల విలువైన అలుగును (Pangolin) విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో అరుదైన వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో DRI (Directorate of Revenue Intelligence), రాపూరు అటవీశాఖ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు చేశారు.
ఆరుగురు నిందితుల అరెస్ట్..
రాపూరు - తెగచర్ల అటవీ ప్రాంతంలో ఈ అలుగును పట్టుకున్నట్లు నిందితులు ప్రాథమిక విచారణలో అంగీకరించారు. దీనిని భారీ ధరకు విక్రయించేందుకు బేరసారాలు సాగిస్తుండగా నిఘా పెట్టిన అటవీ శాఖ అధికారులు.. ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఆరుగురు నిందితులతో పాటు, స్వాధీనం చేసుకున్న అలుగును అటవీ శాఖ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆ అలుగు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి సురక్షితమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి (Rescue Center) తరలిస్తామని అధికారులు వెల్లడించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం దీనిని వేటాడటం లేదా విక్రయించడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు.
భారీ డిమాండ్..
దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అలుగు (Pangolin) ఒక అరుదైన క్షీరద జంతువు. దీని చర్మంపై ఉండే పొలుసులు (Scales) మందుల తయారీలో వాడతారనే ప్రచారంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుట్రలు చేస్తున్నారు.. అప్రమత్తంగా ఉండండి: మంత్రి నారా లోకేశ్
దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telugu News