Share News

అన్నదాతలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి నాదెండ్ల హెచ్చరిక..

ABN , Publish Date - Mar 30 , 2026 | 03:25 PM

నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన విజయవంతంగా సాగుతోంది. కోవూరు మండలం ఇనమడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం గూడూరు మండలం పేడూరు గ్రామాన్ని సందర్శించారు.

అన్నదాతలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి నాదెండ్ల హెచ్చరిక..
Minister Nadepndla Manohar

నెల్లూరు: జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన విజయవంతంగా సాగుతోంది. కోవూరు మండలం ఇనమడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం గూడూరు మండలం పేడూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పేడూరు ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలోని వ్యవసాయ రైతుల సదస్సుకు మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్యే సోమిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పలు అంశాలపై వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇస్తున్నామని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కేంద్రాలను రైతులకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అన్నదాతలు, ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు వారధి వంటి వారని.. రైతును దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.


తూకాల్లో ఎక్కువ ధాన్యం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. అన్నదాతలను దోపిడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల చెప్పారు. న్యాయబద్ధంగా పారదర్శకంగా రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు ఉంటే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలని, అధికారులకూ చెప్పాలని రైతన్నలకు మంత్రి సూచించారు. సమస్యలను బాధ్యతగా తీసుకుని తొలగిస్తామని.. మీ సమస్యలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. జాతీయ ఉపాధి పథకం కింద గ్రామాల్లో ధాన్యం కల్లాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

2,50,893 ఇళ్లను పేదలకు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

ఏఐ వీడియోలతో అప్రమత్తంగా ఉండాలి.. అస్సాం కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం

Updated Date - Mar 30 , 2026 | 03:45 PM