Share News

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం

ABN , Publish Date - Mar 16 , 2026 | 09:37 AM

శ్రీశైలం ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో మహోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు.

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం
Srisailam Temple

నంద్యాల, మార్చి 16: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో(Srisailam Temple) ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు(సోమవారం) ఉదయం ఆలయ యాగశాలలో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. నేటి సాయంత్రం స్వామి, అమ్మవారికి భృంగి వాహన సేవ ఘనంగా నిర్వహించనున్నారు. తర్వాత పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.


భక్తుల రద్దీ కారణంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. స్పర్శ దర్శనం, సాధారణ దర్శనంపై పరిమితులు విధించారు. ఆలయ క్యూలైన్లు కన్నడ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నల్లమల అడవి మార్గాల ద్వారా పాదయాత్రగా వచ్చిన లక్షలాది కన్నడ భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో ఈరోజు నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


ఇవి కూడా చదవండి...

‘డ్యాన్సింగ్ మిసైల్స్‌‌’తో ఇరాన్ దాడులు!

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 09:39 AM