ఐపీఎల్ 2026: ప్రస్తుతానికి మా జట్టుకు ట్రోఫీ అందించడమే నా లక్ష్యం: వైభవ్ సూర్యవంశీ
ABN , Publish Date - Mar 16 , 2026 | 07:48 AM
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన ప్రదర్శనలతో ప్రపంచం దృష్టికి ఆకర్షించుకున్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బీసీసీఐ ‘నమన్ అవార్డ్స్ 2026’ సందర్భంగా.. ఐపీఎల్ గురించి వైభవ్ సూర్యవంశీ ప్రస్తావించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన ప్రదర్శనలతో ప్రపంచం దృష్టికి ఆకర్షించుకున్నాడు. 13 ఏళ్లకే ఐపీఎల్లో అడుగుపెట్టి.. ఆడిన రెండో మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగి ఆశ్చర్యపర్చాడు. ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 175 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బీసీసీఐ ‘నమన్ అవార్డ్స్ 2026’ సందర్భంగా.. ఐపీఎల్ గురించి వైభవ్ సూర్యవంశీ ప్రస్తావించాడు.
‘ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ట్రోఫీని గెలిపించడమే ప్రస్తుతం నా ముందున్న ప్రధాన లక్ష్యం. నా ప్రదర్శన జట్టుకు బాగా ఉపయోగపడాలి. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. ఓ యువ ఆటగాడికి తొలి ఐపీఎల్ క్యాంప్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నాకు కూడా అలాగే అనిపించింది. రాహుల్ ద్రవిడ్ సర్ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన నుంచి క్రికెట్కు సంబంధించి పలు సలహాలు, సూచనలు తీసుకున్నాను. జట్లులోని సీనియర్ ఆటగాళ్ల నుంచి కూడా మంచి అనుభవం సంపాదించాను’ అని వైభవ్ వెల్లడించాడు.
ఆనందంగా ఉంది..
‘బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో నా అండర్ 19 ప్రపంచ కప్ విజేత సహచరులను, కోచ్లను మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ కప్లో భారత్కు ట్రోఫీ గెలిపించడం ఎంతో ప్రత్యేకం. ఈ అవార్డ్స్ వల్ల నా సహచరులను కలిసే అవకాశం దక్కింది’ అని వైభవ్ సూర్యవంశీ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం నాపై పడకుండా చేశారు: అభిషేక్ శర్మ
భవిష్యత్తులో టీమిండియా మరిన్ని కప్పులు గెలుస్తుంది: సంజు శాంసన్