పసలేని ప్రతిపక్ష విమర్శలను పట్టించుకోం: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:53 PM
మచిలీపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. చిన్న క్యాంప్ బెల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హెడ్ వాటర్ ట్యాంక్ను ఆయన గురువారం ఘనంగా ప్రారంభించారు.
మచిలీపట్నం, జులై 09: మచిలీపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బందరు మండలం కానూరు శివారు చిన్న క్యాంప్ బెల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హెడ్ వాటర్ ట్యాంక్ను ఆయన గురువారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. వైసీపీ అధినేత నుంచి చోటా నాయకుల వరకు అభివృద్ధికి ఆటంకాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు చేస్తున్న పసలేని విమర్శలను తాము పట్టించుకోబోమని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమం, అభివృద్ధి బాటలో ముందుకు సాగుతామని మంత్రి వెల్లడించారు.
ఇంటింటికీ తాగునీరు.. త్వరలోనే బందరు పోర్టు
బందరు పట్టణంలో ఇప్పటికే ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నామని, అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రతి ఇంటికీ సురక్షిత జలాలు అందించేందుకు జలజీవన్ మిషన్ కింద రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంత రూపురేఖలను మార్చే ప్రతిష్ఠాత్మక బందరు పోర్టు పనులను వేగవంతం చేసి, వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. దీని ద్వారా మచిలీపట్నం ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read:
వైసీపీ నేతలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్
కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యత: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్