ప్రతి సమస్యనూ పరిష్కరించే బాధ్యత నాది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:03 PM
నంద్యాల జిల్లా బనగానపల్లెలో రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
నంద్యాల జిల్లా: బనగానపల్లెలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పాలకుల నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించిందని విమర్శించారు. మాట వినని వారి భూములను 22ఏ జాబితాలో చేర్చారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినట్లు తెలిపారు.
ప్రజల ఆస్తిపై ప్రజలకే హక్కు ఉండాలని స్పష్టం చేసిన సీఎం.. భూమి ప్రజలదైతే పట్టా పుస్తకాలపై, భూమి సరిహద్దు రాళ్లపై గత ప్రభుత్వం తమ ఫొటోలు, పేర్లు ముద్రించడం సరైంది కాదన్నారు. ఫొటోల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. జగన్ ఫొటోలతో ఉన్న పాత పట్టాదారు పాస్పుస్తకాలను రద్దు చేసి, ఇప్పుడు రాజముద్రతో పాస్పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు.
రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి సమస్యనూ పరిష్కరించే బాధ్యత తమదేనని చెప్పారు. దళారీ వ్యవస్థకు తావు లేకుండా గ్రామసభల్లోనే పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టాదారు పాస్పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా భూమికి సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Also Read:
వైసీపీ నేతలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్
కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యత: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్