ఈనెల 14న మీనాక్షి నటరాజన్ను కలుస్తా: మంత్రి కొండా సురేఖ
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:44 PM
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి మంత్రి సురేఖ ఫిర్యాదు కూడా చేశారు. ఈ వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి కొండా తాజాగా మాట్లాడారు.
హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ముదురుతోంది. దేవాదాయ శాఖతో పాటు జిల్లా రాజకీయాల్లో కడియం జోక్యం చేసుకోవడంపై మంత్రి సురేఖ సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఈ వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి కొండా తాజాగా మాట్లాడారు.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను మంత్రి సురేఖ వెల్లడించారు. తాను, తన భర్త ఇద్దరం కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంటికి వెళ్లినట్లు సురేఖ వెల్లడించారు. అయితే, ఆయన తీరు చూస్తుంటే వివాదాన్ని పరిష్కరించడం, కలిసిపోవడం ఇష్టం లేనట్లుగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న తనను బయటకు రప్పించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఈ నెల 14న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలుస్తానని మంత్రి వెల్లడించారు.
మంత్రి చేయాల్సిన పనులు కడియం చేస్తానంటే ఎలా? అంటూ ఈ సందర్భంగా కొండా సురేఖ ప్రశ్నించారు. అధికారులను మూడు నెలలుగా కడియం ఒత్తిడి చేస్తున్నారని, అందువల్లే సమావేశంలో పాల్గొనాల్సి వచ్చిందని అధికారులు చెప్పారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్కు తన బాధ చెప్పుకున్నానని వెల్లడించారు. అన్ని విషయాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వారిద్దరూ హామీ ఇచ్చారని తెలిపారు. తన జీవితమంతా ముళ్లబాటేనని ఈ సందర్భంగా మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారంపైనా మంత్రి సురేఖ స్పందించారు. అయోధ్యలో శ్రీరాముడి పేరు చెప్పి దోచుకున్న వారిని ఆయనే శిక్షిస్తాడని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి...
సింగరేణి డిమాండ్లపై ఈనెల 20 నుంచి నిరవధిక దీక్ష: కవిత
తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఎంపీ చామల స్పందన