Share News

తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఎంపీ చామల స్పందన

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:37 PM

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి స్పందించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.

తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఎంపీ చామల స్పందన
Chamala Kiran Kumar Reddy

హైదరాబాద్, జులై 9: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి స్పందించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఈరోజు(గురువారం) ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్‌కు, ఎంపీగా తనకు ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేదని, అయినా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కున చేర్చుకుని గెలిపించారన్నారు.


‘నేను ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకం కాదు. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్ష పదవికి, పీఏసీఎస్ చైర్మన్ పదవికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ప్రమోట్ చేయలేదు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎవరిని కోరుకుంటే వారికే పదవులు ఇద్దామని మందుల సామేల్‌తో చెప్పాను. మందుల సామేల్ తీసుకునే నిర్ణయానికి నేను వ్యతిరేకం కాదు. నేను విదేశాల్లో ఉన్నప్పుడు మండల అధ్యక్షులను ప్రకటించారు. దీనిపై నాకు కాంగ్రెస్ కార్యకర్తలు ఫోన్ చేశారు. ఇదే అంశాన్ని నేను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లాను. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత మండలం తిరుమలగిరి, నా సొంత మండలం శాలి గౌరారం తుంగతుర్తిలోనే ఉన్నాయి. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పాను. మండల స్థాయిలో కార్యకర్తలు.. ఎవరికి ఎక్కువగా మద్దతు ఇస్తే వారికే అవకాశం ఇద్దాం. పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే ప్రజల్లో చులకన అవుతాము. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్ సమన్వయం పాటించాలి. మనకు పదవులు వచ్చాయి. మన గెలుపు కోసం పని చేసిన కేడర్‌ను పట్టించుకోవాలి. ప్రజలు నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.


ఇవి కూడా చదవండి...

పెట్టుబడుల పేరుతో మోసం.. ఫిఫా ప్రసార హక్కుల సంస్థకు రూ.2 కోట్ల టోకరా

సింగరేణి డిమాండ్లపై ఈనెల 20 నుంచి నిరవధిక దీక్ష: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 12:48 PM