Share News

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం.. తీవ్ర విమర్శలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:22 PM

రిపబ్లిక్ డే వేడుకల్లో గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం అందజేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి కారణమైన వైసీపీ నాయకులకు వదిలి టీడీపీ నేతలపై సీఐ కనకరావు కేసులు పెట్టారని మండిపడుతున్నారు.

సీఐ కనకారావుకు ప్రశంసా పత్రం.. తీవ్ర విమర్శలు

కృష్ణా జిల్లా, జనవరి 27: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడిచేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేసి, కార్లకు నిప్పంటించి.. పార్టీ ఆఫీస్‌ను పూర్తిగా దగ్ధం చేశారు. ఓవైపు వారు పార్టీ కార్యాలయాన్ని తగులబెడుతున్నా.. అప్పటి సీఐ కనకారావు, గన్నవరం పోలీసులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడమే కాకుండా తమ పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేశారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.


ఈ ఘటన అనంతరం టీడీపీ నేతలు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట ఘర్షణకు దారి తీసింది. వైసీపీ నాయకులు రాళ్లు రువ్వడంతో సీఐ కనకారావు తలకు గాయమైంది. అయితే దాడికి కారణమైన వైసీపీ నాయకులను వదిలేసి.. టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు కనకారావు. మరోవైపు పార్టీ కార్యాలయం దగ్ధమైన విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన నాటి మాజీ సీఎం చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.


జిల్లా ఎస్పీ జాషువా ఎయిర్‌పోర్ట్ ముందు భారీ వాహనాలను అడ్డుపెట్టి మరీ చంద్రబాబును గన్నవరం రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో.. గతంలో వైసీపీ నేతలు దాడికి పాల్పడుతుంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా.. టీడీపీ నేతలపైనే కేసు నమోదు చేసిన సీఐ కనకారావుకు గణతంత్ర దినోత్సవం నాడు ప్రశంసాపత్రం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై సోషల్‌ మీడియాలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.


ఇవి కూడా చదవండి..

యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 27 , 2026 | 12:40 PM