గన్నవరంలో బిల్ గేట్స్కు ఘన స్వాగతం..
ABN , Publish Date - Feb 16 , 2026 | 08:42 AM
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్తోపాటు ఆయన ప్రతినిధి బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
అమరావతి, ఫిబ్రవరి 16: గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్తోపాటు ఆయన ప్రతినిధి బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అంతకు ముందు పొగ మంచు కారణంగా దాదాపు 15 నిమిషాలపాటు.. బిల్స్ గేట్స్ ప్రతినిధుల బృందం ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏటీసీ అనుమతి ఇవ్వడంతో గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయింది. ఇక బిల్ గేట్స్ ప్రతినిధి బృందంతోపాటు స్వాగతం పలికిన మంత్రులు, అధికారుల బృందం వెలగపూడిలోని సచివాలయానికి ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరారు. సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి స్వాగతం పలకనున్నారు. అనంతరం బిల్ గేట్స్ ప్రతినిధి బృందంతో వారంతా సమావేశం కానున్నారు.
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు విస్తరించే అంశంపై వీరంతా చర్చించనున్నారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకుని.. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ ప్రతినిధి బృందం పరిశీలించనుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ విధి విధానాలు, ఫలితాలను ఈ సందర్భంగా బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించనున్నారు.
అలాగే గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఇందులో స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై సీఎం ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, సంజీవని తదితర ప్రాజెక్టులను బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు వివరిస్తారు.
బిల్ గేట్స్కు చెందిన గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్ట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉండవల్లి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో బిల్ గేట్స్ బృందం పర్యటించనుంది. అక్కడ డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని ఈ బృందం పరిశీలించనుంది. ఈ బృందం వెంట సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, అధికారులు ఉండనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తీవ్ర విషాదం.. బైకులు ఢీకొని ఇద్దరి మృతి
గన్నవరం విమానాశ్రయం వద్ద చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానం..
For More AP News And Telugu News