విధ్వంసం నుంచి వికాసం వైపుకు ఏపీ: మంత్రి సంధ్యారాణి
ABN , Publish Date - May 09 , 2026 | 03:38 PM
23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి, భరోసా కలిగించే పరిపాలన అందుతోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వైజాగ్ అంటే ఒకప్పుడు గంజాయి గుర్తొచ్చేదని.. నేడు గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తుకొస్తున్నాయన్నారు.
అమరావతి, మే 9: విధ్వంస పాలన నుంచి వికాస పాలన వైపు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... 23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి, భరోసా కలిగించే పరిపాలన అందుతోందన్నారు. వైసీపీ హయాంలో ప్రజల సమస్యలు చెప్పుకోవడానికే భయపడేవారని.. నేడు ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
వైజాగ్ అంటే ఒకప్పుడు గంజాయి గుర్తొచ్చేదని.. నేడు గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తుకొస్తున్నాయని మంత్రి అన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో గంజాయి తోటల స్థానంలో కాఫీ తోటలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడం కూటమి ప్రభుత్వ చరిత్రాత్మక విజయంగా చెప్పుకొచ్చారు. యువత చేతిలో ఆయుధాలు కాదు.. ఉద్యోగాలు, నైపుణ్యాలు, అవకాశాలు ఉండాలనేదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో గొప్ప సంఘటనన్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర సహకారంతో వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని సంధ్యారాణి అన్నారు. గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు. జగన్కు ఇంట్లో వారిపైనే గౌరవం లేదని.. ఇక ప్రజలపై గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అధికార దాహం కోసం యువత చేతికి కత్తులు, గొడ్డళ్లు ఇచ్చే వైసీపీ నేతల మోసపూరిత మాటలకు బలికావొద్దని.. కోడికత్తి శ్రీను ఉదంతాన్ని గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. సూపర్ 6 పథకాలు గిరిజనులకు ఎంతగానో తోడ్పడుతున్నాయని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన తండ్రి
సర్కిల్కు టిప్పు సుల్తాన్ పేరు.. కడపలో ఉద్రిక్తం
Read Latest AP News And Telugu News