వైసీపీ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ డిమాండ్.. శాసనమండలి వాయిదా
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:06 PM
ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 20: దేవుడి అంశం శాసనమండలిని(AP Legislative Council) కుదిపేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఫొటోలతో వైసీపీ సభ్యులు సభలో నిరసనకు దిగడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఈ క్రమంలో సభ వాయిదా పడగా.. కాసేపటికి తిరిగి మొదలైంది. అయితే వైసీపీ క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేయగా... తాము దేవుడిని అవమానించలేదంటూ వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో మరోమారు వాయిదా పడింది.
ఈ రోజు(శుక్రవారం) ఉదయం వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మాలను ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన చేపట్టారు. వేంకటేశ్వర స్వామి ఫొటోలతో ఆందోళనకు దిగారు. వైసీపీ తీరును మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) తప్పుబట్టారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. తిరిగి కొద్దిసేపటికి సభ మొదలైనా.. మరోమారు కూటమి సభ్యులు ఆందోళనకు దిగారు. ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి.. దేవుడిని అవమానించిన వైసీపీ సభ్యులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవదేవుడిని వైసీపీ సభ్యులు అవమానించారంటూ కూటమి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. దేవుడిని తాము అవమానించలేదంటూ వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే మండలి సమావేశాన్ని ఛైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు సీఎం చంద్రబాబు.. టెక్ దిగ్గజాలతో ఒప్పందాలు..
Read Latest AP News And Telugu News