గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఎంతంటే.?
ABN , Publish Date - Mar 21 , 2026 | 01:29 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసును సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసు(Retirement Age)ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(Group of Ministers) నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నేడు(శనివారం) సమావేశమైన మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నారాయణ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
వయసు సడలింపు అంశాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిరాకరించగా.. కూటమి ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మేలుచేసే నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు. ఈ మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఉద్యోగులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు మేలు చేసిన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
రెచ్చిపోయిన కామాంధుడు.. మతిస్థిమితం లేని బాలికలే టార్గెట్..!
ఏఐతో శ్రీవారి దర్శనం మరింత సులభతరం: సీఎం చంద్రబాబు