164 వెటర్నరీ పోస్టులపై అసత్య ప్రచారాన్ని ఖండించిన పశుసంవర్ధక శాఖ
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:07 PM
రాష్ట్రంలో వీఏఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై పశుసంవర్ధక శాఖ స్పందించింది. కావాలనే ఈ విషయమై అసత్య ప్రచారం జరుగుతోందని స్పష్టం చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(VAS) పోస్టుల భర్తీకి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై పశుసంవర్ధక శాఖ స్పందించింది. 164 వీఏఎస్ పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపింది. నియామక ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరగలేదని శాఖ సంచాలకులు స్పష్టం చేశారు.
వెటర్నరీ, లైవ్స్టాక్, డెయిరీ విభాగాలకు చెందిన అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆయా పోస్టులను విభజించినట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. 2016లో జారీచేసిన జీఓ నం.52లోని నిబంధనల ప్రకారమే పోస్టుల కేటాయింపు జరిగిందని వెల్లడించింది. వీఏఎస్ నియామకాల్లో విద్యార్హతలకు సంబంధించిన వెయిటేజీ విషయంలోనూ ఎలాంటి మార్పులు చేయలేదని శాఖ స్పష్టం చేసింది. బీవీఎస్సీ అభ్యర్థులకు 60 మార్కులు, ఎంవీఎస్సీ అభ్యర్థులకు 10 మార్కుల వెయిటేజీ నిబంధనల ప్రకారమే అమల్లో ఉన్నట్లు పేర్కొంది.
అలాగే.. డెయిరీ టెక్నాలజీ అభ్యర్థులకు 4 మార్కుల వెయిటేజీ ఇవ్వడం కూడా నిబంధనల్లో భాగమేనని వివరించింది. ఆయా విద్యార్హతలు, అభ్యర్థుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నియామక ప్రక్రియను రూపొందించినట్లు తెలిపింది. రాష్ట్రంలో అవసరమైన వెటర్నరీ సేవలను బలోపేతం చేయడం సహా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా పోస్టుల విభజన చేపట్టినట్లు పశుసంవర్ధక శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాలు, న్యాయబద్ధత, అమల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనలను అనుసరించే విధంగానే నియామకాలు జరిగినట్టు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలు.. తోసిపుచ్చిన కేంద్రం
పాక్ తయారీ ఫెయిర్నెస్ క్రీములపై కేంద్రం హెచ్చరిక