ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:47 PM
AP మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. కాశీబుగ్గలో నమోదైన హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి సోంపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
శ్రీకాకుళం, ఆగస్టు 14: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. కాశీబుగ్గలో నమోదైన హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి సోంపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత 23 రోజులుగా శ్రీకాకుళం (అంపోలు) జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, కోర్టు తీర్పుతో త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.
కేసు నేపథ్యం, ఆరోపణలు
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక గొర్రెల కాపరి (దానయ్య) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి కుమారుడి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరిపిన పోలీసులు, కేసును పక్కదోవ పట్టించేందుకు, సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సీదిరి అప్పలరాజుపై అభియోగాలు మోపారు. దీని ఆధారంగా కాశీబుగ్గ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు.
23 రోజుల రిమాండ్ తర్వాత లభించిన బెయిల్
గత 23 రోజులుగా జైలులోనే ఉన్న సీదిరి అప్పలరాజు తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం సోంపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సమర్పించిన దరఖాస్తులు తిరస్కరణకు గురైనప్పటికీ, తాజాగా ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం
Read Latest National News And Telugu News