విడాకులు ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Feb 20 , 2026 | 10:53 AM
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విడాకులు ఇవ్వలేదని భార్యను హతమార్చాడు భర్త. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లా: బిక్కవోలు మండలం రంగాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ధనుకొండ దుర్గయ్యకు సొంత అక్క కూతురు జ్యోతితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కుమారులు. దుర్గయ్య వ్యవసాయం చేస్తుండగా జ్యోతి పెద్దాపురంలోని ఓ రొయ్యల కంపెనీలో పని చేస్తోంది. మొదట్లో వారిద్దరూ ఎంతో అన్యోనంగా ఉండేవారు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు దుర్గయ్య. దీంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో జ్యోతి పుట్టింటికి వెళ్లిపోయింది. తనతో కలిసి ఉండాలని లేదా విడాకులు ఇవ్వాలని జ్యోతిని బలవంతం చేస్తూ వచ్చాడు దుర్గయ్య.
భర్తపై నమ్మకం లేక పుట్టింటిలోనే ఉంటోంది జ్యోతి. దీంతో తన భార్యపై బాగా ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన పని ముగించుకొని బస్సులో గ్రామానికి చేరుకున్న జ్యోతిపై దుర్గయ్య ఒక్కసారిగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భార్యను చంపినందుకు తనను ఎలాగైనా అరెస్ట్ చేస్తారనే భయంతో దుర్గయ్య పురుగులమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిక్కవోలు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
తేనెటీగల దాడి.. మైదానంలోనే అంపైర్ మృతి
గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telugu News