అమరావతిలో పోలీసుల క్రికెట్ పోటీలు.. పాల్గొన్న హోం మంత్రి అనిత
ABN , Publish Date - Feb 20 , 2026 | 10:07 AM
ఏపీ పోలీస్ టీ20 క్రికెట్ టోర్నీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. పోలీసులు ఇప్పటికే ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్లో ముందుంటారని చెప్పారు. ఈ టోర్నీతో పోలీసుల ప్రైడ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 20: మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్(APSP) బెటాలియన్ గ్రౌండ్స్లో రెండవ అఖిల భారత పోలీస్ సౌత్జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ టోర్నీని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha), ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల మార్చ్పాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అతిథులు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, ఐటీబీబీ, బోర్డర్ టీమ్లు ఈ పోటీలో తలపడుతున్నాయి.
మహిళలకూ పోటీలు నిర్వహించాలి: హోం మంత్రి
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. పోలీసుల్లో క్రీడా స్పూర్తిని, ఐక్యతను బయటపెట్టేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడ, ఏ విపత్తు జరిగినా మొదట పరుగెత్తేది పోలీసులేనని, 24 గంటలూ డ్యూటీలో ఉండేవారికి ఇలాంటి క్రీడలు మానసిక ఆనందాన్నిస్తాయని ఆమె చెప్పారు. అమరావతి అంటేనే ప్రజల రాజధాని అని.. దీనిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ టోర్నీని ఇక్కడ నిర్వహించడంతో పాటు 160 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
రాబోయే కాలంలో అమరావతి ప్రైడ్ మరింత విస్తరిస్తుందని హోం మంత్రి తెలిపారు. సీఎం దూరదృష్టి, ప్రణాళికాబద్ధమైన పనులతో అద్భుత రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు. క్రీడల్లో గెలుపోటములు ఎలా ఉన్నా పోటీ పడటమే ముఖ్యమని తెలిపారు. పోలీసులు ఇప్పటికే ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్లో ముందుంటారని చెప్పారు. ఈ క్రికెట్ టోర్నీతో పోలీసుల ప్రైడ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. క్రీడా పోటీల వల్ల ఇంటర్ స్టేట్ సంబంధాలు మెరుగుపడతాయని వెల్లడించారు. మహిళలకూ ఇటువంటి పోటీలు నిర్వహించాలని అనిత అభిప్రాయపడ్డారు.

క్రీడా నైపుణ్యానికి ప్రధాన కేంద్రంగా అమరావతి: డీజీపీ
ఈ కార్యక్రమం కేవలం క్రీడాపోటీ మాత్రమే కాదని.. పోలీస్ బలగాల క్రమశిక్షణ, ఐక్యత, స్ఫూర్తికి నిదర్శనమని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. అమరావతి ఇప్పటికే 'ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26'ను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. ఇప్పుడు ఈ టోర్నమెంట్తో క్రీడా నైపుణ్యానికి ప్రధాన కేంద్రంగా మారుతుందని చెప్పారు. క్రీడలు సహృదయత, పట్టుదల, జట్టు స్ఫూర్తిని పెంచుతాయన్నారు. పోలీస్ సేవలో ఈ గుణాలు అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కమిటీ, సిబ్బంది, వలంటీర్లకు అభినందనలు తెలిపారు డీజీపీ. దక్షిణ భారతదేశం, కేంద్ర బలగాల క్రీడాకారులకు సెల్యూట్ చేశారు. ‘విధి నిర్వహణలో ఉన్నప్పటికీ మనమంతా ఐక్యత, విలువలతో ఉన్నామని ఈ టోర్నమెంట్ గుర్తు చేస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి శాప్, జిల్లా కలెక్టర్లు, విశ్వవిద్యాలయ భాగస్వాములు, స్పాన్సర్లు సహకారం అందించారన్నారు. క్రీడల్లోని క్రమశిక్షణ, ఐక్యతను ఎప్పుడూ కొనసాగిద్దామని చెప్పారు. పోలీస్ బలగాల ప్రతిష్ఠను పెంచడానికి రాష్ట్ర పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...
తేనెటీగల దాడి.. మైదానంలోనే అంపైర్ మృతి
గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telugu News