దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:25 PM
తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టిన రోజులు వేడుకలు జరుపుకున్న దివ్వెల మాధురి, బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామిలపై చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది.
తిరుమల, మార్చి 06: తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న దివ్వెల మాధురి, బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామిలపై చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. తిరుమలలో ఈ తరహా వేడుకలు పూర్తిగా నిషేధమని టీటీడీ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ పుట్టిన రోజు వేడుకలను చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అభ్యంతరం తెలిపింది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమలకు కేక్ తీసుకు వచ్చి.. కట్ చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని విజిలెన్స్కు ఇచ్చిన ఫిర్యాదులో టీటీడీ స్పష్టం చేసింది.
గతంలోనూ తిరుమలలో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ రీల్స్ చేశారు. దీనిపై విజిలెన్స్ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆ సమయంలో టీటీడీ హెచ్చరించింది. ఆ తర్వాత పలువురు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారిపై టీటీడీ చర్యలు కూడా తీసుకున్న విషయం విదితమే. ఇటీవల యూట్యూబర్ గీతూ రాయల్ సైతం తిరుమలలో రీల్స్ చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దివ్వెల మాధురి, తనూజ పుట్టస్వామి జన్మదిన వేడుకలపైనా భక్తులు మండిపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News