సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు
ABN , Publish Date - Mar 06 , 2026 | 02:54 PM
సివిల్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
న్యూఢిల్లీ, మార్చి 06: సివిల్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. రాజేశ్వరి సువే రెండో స్థానంలో నిలిచారు. ఆకాన్ష్ ధుల్ మూడో ర్యాంక్ పొందారు. రాఘవ్ ఝున్ఝున్ వాలా నాలుగో ర్యాంక్ సాధించారు. ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు సత్తా చాటారు. సృజన (55వ ర్యాంక్), డీఎస్కే ప్రచేత్ (193వ ర్యాంక్), ఎస్. వర్షిత్రెడ్డి (259వ ర్యాంక్), ఎం.పవన్కుమార్రెడ్డి (297వ ర్యాంక్), వి. విక్రమసింహారెడ్డి (541వ ర్యాంక్), గుమ్మల శ్వేత (573వ ర్యాంక్), పోతుపురెడ్డి భార్గవ్ (537వ ర్యాంక్), పుడారి రాహుల్ (748వ ర్యాంక్), కత్తిమాని అనిరుధ్ (786వ ర్యాంక్), కోరపాతుల శ్రీకర్రాజు (806వ ర్యాంక్), ఇస్లావత్ శ్రీరామ్ హర్ష (823 ర్యాంక్), కట్టా ప్రత్యూష (908వ ర్యాంక్), గోగుల రాజశేఖర్ (920వ ర్యాంక్), గుగులోతు జితేందర్ నాయక్ (939వ ర్యాంక్) సాధించారు.
ఈ పరీక్షా ఫలితాలు విడుదలైన 15 రోజుల్లో వెబ్ సైట్లో మార్కులు అప్ లోడ్ చేస్తామని యూపీఎస్సీ ప్రకటించింది. మరిన్ని వివరాలు కోసం ఈ ఫోన్ నెంబర్లు.. 23385271, 23381125, 23098543 సంప్రదించాలని ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సూచించింది. ఉదయం 10 నుంచి 05.00 గంటల మధ్య సంప్రదించాలని యూపీఎస్సీ స్పష్టం చేసింది.
గతేడాది అంటే.. 2025లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఆగస్ట్, సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలు చేపట్టారు. వాటిలో అర్హత పొందిన వారికి ఈ ఏడాది ఫిబ్రవరిలో మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ చివరి వడపోతలో మొత్తం 958 మంది అభ్యర్థులు సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్తో పాటు గ్రూప్ ఎ, గ్రూప్ బిలో వివిధ సెంట్రల్ సర్వీస్లో వీరంతా చేరనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్ణాటక రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా నిషేధం
రాజ్యసభకు బిహార్ సీఎం నితీశ్ నామినేషన్
For More National news And Telugu News