CM Revanth Reddy On Education:పేదలకు మెరుగైన విద్య అందించాలి.. అధికారులకి సీఎం రేవంత్రెడ్డి కీలక సూచనలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 09:58 PM
పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకి సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకి సీఎం దిశానిర్దేశం చేశారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్టా రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులకి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్రెడ్డి. తొలి దశలో అవుటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్పై దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సూచించారు.ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని ఆజ్ఞాపించారు సీఎం రేవంత్రెడ్డి.
సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని ఆదేశించారు. నర్సరీ నుంచి నాల్గోతరగతి వరకు నూతన స్కూల్స్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించారు. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు. 2026 జూన్లో అకడమిక్ ఇయర్ నుంచి ప్రణాళికలు అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలని సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. ఫారెస్ట్ సిబ్బందిపై వేట కొడవళ్లతో దాడి
Read Latest Telangana News And Telugu News