Share News

Lionel Messi India Tour: హైదరాబాద్‌లో లియోనెల్ మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:42 PM

అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం ఇండియా టూర్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతడి పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మూడు రోజుల భారత పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి అభిమానుల్ని అలరించనున్నాడు మెస్సీ. ఆ పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...

Lionel Messi India Tour: హైదరాబాద్‌లో లియోనెల్ మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..
Lionel Messi India Tour 2025

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన(Lionel Messi India tour)లో భాగంగా ఈ నెల 13న భాగ్యనగరానికి రానున్నాడు. 'ది గోట్ ఇండియా టూర్‌-2025'లో భాగంగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొననున్నాడు(Hyderabad GOAT Cup). ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కలిసి మెస్సీ.. గోట్ కప్‌నకు అటెండ్ అవనున్నాడు. ఈ అర్జెంటీనా లెజెండ్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటు ఫుట్‌బాల్ అభిమానులు.. ఇటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎందరో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


సీఎంతో కలిసి..

ఈనెల 13న తెల్లవారుజామున కోల్‌కతా(Kolkata)కు చేరడంతో మెస్సీ(Messi) భారత పర్యటన అధికారికంగా ప్రారంభమవుతుంది. అదే రోజు అక్కడ తన 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాడు. ఇప్పటివరకూ అతడి అతిఎత్తైన విగ్రహమిదే(Biggest Ever Statue). భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించనున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

అదే రోజు సాయంత్రం.. ప్రత్యేక విమానం ద్వారా మెస్సీ హైదరాబాద్‌(Hyderabad)కు విచ్ఛేయనున్నాడు. అతడితో పాటు సుమారు 200 మందితో కూడిన టీమ్ కూడా భాగ్యనగరానికి రానుంది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం ఈ స్టార్ ఆటగాడు.. యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లకు మాస్టర్ క్లాస్ ఇవ్వనున్నాడు. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్స్‌(Penalty Shootout)లో సందడి చేయనున్నాడు. చివర్లో మ్యూజికల్ కాన్సెర్ట్(Musical Concert) జరగనుంది. ఆరోజు రాత్రి మెస్సీ.. నగరంలోనే బస చేయనున్నాడు. ఈ లెజెండరీ ప్లేయర్ నగర పర్యటన సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు అధికారులు. మెస్సీ, అతడి బృందం హైదరాబాద్‌కు చేరుకున్నప్పటి నుంచి స్వదేశానికి వెళ్లేంతవరకూ భారీ భద్రత కల్పించనున్నారు.


ర్యాంప్ వాక్..

హైదరాబాద్ పర్యటన ముగిశాక.. మరుసటి రోజు ముంబయి(Mumbai)కి వెళ్లనున్నాడు మెస్సీ. అక్కడ సెలబ్రిటీలతో కలిసి ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొననున్నాడు. ఆ తర్వాత ఓ సామాజిక సేవ కోసం నిర్వహించే ఈవెంట్‌‌‌‌లో ర్యాంప్‌‌‌‌ వాక్(Ramp Walk) చేసి అలరించనున్నాడు. చివరగా.. ఢిల్లీ(Delhi) చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)తో భేటీ కానున్నాడు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమాలు ముగిశాక.. అదే రోజు రాత్రి స్వదేశానికి బయలుదేరనున్నాడు.

మెస్సీ.. భారత్‌కు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2011లో వెనిజువెలా(Venezuela)తో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం కోల్‌కతాలో పర్యటించాడు.

Lionel Messi.jpgలియోనెల్ మెస్సి


ఇవీ చదవండి:

తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం: పవన్

Updated Date - Dec 10 , 2025 | 06:24 PM