Sudarshan Reddy Comments on Vice Presidential Election: ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోంది: సుదర్శన్ రెడ్డి
ABN , Publish Date - Sep 01 , 2025 | 02:55 PM
తనపై విమర్శలు చేస్తే ఎన్నికల పోటీ నుంచి వెనక్కు తగ్గను అని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను వెనక్కు తగ్గి సైలెంట్ అయిపోతానని కొంతమంది అనుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించే వారు తాను ఇచ్చిన తీర్పు చదవాలని సూచించారు.
హైదరాబాద్, సెప్టెంబర్1, (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) తాజ్ కృష్ణాలో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని.. ప్రతిపక్షాల అభ్యర్థినని నొక్కిచెప్పారు సుదర్శన్ రెడ్డి.
తాను ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించను అని స్పష్టం చేశారు. తనపై ఏవేవో ముద్రలు వేస్తున్నారని... అస్సలు బాధగా లేదని చెప్పుకొచ్చారు. తనపై విమర్శలు చేస్తే ఉప రాష్ట్రపతి ఎన్నికల (Vice President Election) పోటీ నుంచి వెనక్కు తగ్గను అని తెలిపారు. తనను విమర్శిస్తే ఈ ఎన్నికల పోటీ నుంచి వెనక్కు తగ్గి సైలెంట్ అయిపోతానని కొంతమంది అనుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించే వారు తాను ఇచ్చిన తీర్పు ఒక్కసారి చదవాలని సూచించారు. కోర్టు తీర్పుల గురించి మాట్లాడేవారు వాటిని చదివి మాట్లాడాలని కోరారు. అది తన తీర్పు కాదని.. కోర్టు తీర్పు అని ఉద్ఘాటించారు. తన తీర్పును 11 మంది న్యాయమూర్తులు చదివారని... అందులో ఒక్క విషయాన్ని కూడా మార్చలేకపోయారని పేర్కొన్నారు సుదర్శన్ రెడ్డి.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రసంగంలోని కీలక అంశాలు...
రాజ్యాంగ వ్యవస్థలు మసకబారుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరముంది.
ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు.
నేను ప్రతి ఎన్నికల్లో పాల్గొని నా ఓటు హక్కు వినియోగించుకున్నాను.
పౌరహక్కులు, సామాజిక న్యాయం, ఆదేశిక సూత్రాల గురించి నేను మాట్లాడుతాను.
రాజకీయ ముళ్లకిరీటం ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని కొందరూ అడుగుతున్నారు.
వాళ్లందరికీ రాజ్యాంగాన్ని పట్టుకొని సమాధానం చెబుతున్నాను.
ఉప రాష్ట్రపతి పదవి రాజకీయపరమైన పదవి కాదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఐదుసార్లు రాజ్యాంగంపై నేను ప్రమాణం చేశాను.
రాజ్యాంగానికి లోబడి ఉండటమే కాదు, కాపాడటం నా బాధ్యత.
ఆదేశిక సూత్రాలను పాటించే వ్యక్తిని నేను.
ఈ దేశంలోని ప్రజలు ముందు ఓటర్లు, తర్వాతనే పౌరులు అయ్యారు.
ఓటరు లిస్ట్ చిత్తు కాగితం అని కొంతమంది అనుకుంటున్నారు.
మాకు ఇష్టం ఉన్న వారి పేరు రాస్తాం, ఇష్టం లేని వాళ్ల పేర్లు రాయమంటే ఎలా..?.
మెజారిటీ ఉంది చట్టం చేస్తాం అంటే ఎలా..?.
రాజ్యాంగం మంచి వాళ్ల చేతుల్లో ఉన్నంత వరకే దానికి రక్షణ అని సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు
తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం
Read latest Telangana News And Telugu News