CM Revanth Reddy: వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయి వసతులు ఉండాలి: సీఎం రేవంత్రెడ్డి
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:28 PM
తెలంగాణ రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయి వసతులు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. విద్యా, వైద్య రంగాలపై ప్రతి నెల మూడో వారం సమీక్ష నిర్వహించాలని వైద్యశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: వైద్యశాఖ అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, ఇతర అంశాలపై సీఎం చర్చించారు. ఈ సమీక్షకు మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయి వసతులు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అన్ని కళాశాలల్లో మూడేళ్లలోగా వసతుల నిర్మాణం పూర్తి అవ్వాలని నిర్దేశించారు. ప్రతి కళాశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు అధికారుల కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైద్య కళాశాలల అవసరాలు, నిధుల వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీల భర్తీ, సిబ్బంది ప్రమోషన్లపై చర్చించారు.
అనుబంధ ఆస్పత్రుల్లో పరికరాలు, సరిపడా పడకలను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులకు తాను చొరవ తీసుకుంటానని తెలిపారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్గా బోధించాలని కోరారు. జపాన్లో తెలంగాణ నర్సులకు డిమాండ్ ఉందని అన్నారు. ఆస్పత్రుల్లో రోగులు, వైద్యుల మానిటరింగ్ కోసం యాప్పై అధ్యయనం చేయాలని సూచించారు. విద్యా, వైద్య రంగాలపై ప్రతి నెల మూడో వారం సమీక్ష నిర్వహించాలని వైద్యశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News