Rohit Sharma: కివీస్ కోసం త్రిశూల వ్యూహం.. రోహిత్ స్కెచ్ వేస్తే ఇట్లుంటది
ABN , Publish Date - Mar 08 , 2025 | 11:35 AM
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యూహాలకు పదును పెడుతున్నాడు. కివీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మాస్టర్ స్ట్రాటజీలు రెడీ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ త్రిశూల వ్యూహంతో సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

రెండు వారాల శ్రమ.. నాలుగు కీలక జట్లపై గెలుపు.. ఒకదాన్ని మించిన మరో సవాల్ను దాటడం.. ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసి విజయాల బాట పట్టడం.. వెరసి చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్కు చేరుకుంది భారత్. గ్రూప్ దశలో బంగ్లాదేశ్తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ను మట్టికరిపించింది రోహిత్ సేన. సెమీస్లో డేంజరస్ ఆస్ట్రేలియాను ఓడించి.. ఇప్పుడు కివీస్తో ఫైనల్ ఫైట్కు రెడీ అవుతోంది. మరోసారి బ్లాక్కాప్స్ పనిపట్టాలని చూస్తోంది. తుదిపోరులో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందుకోసం ఏకంగా మహాభారత యుద్ధ వ్యూహాల్లో ఒకటైన త్రిశూల వ్యూహంతో రోహిత్-గంభీర్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఎదురుదాడితో..
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్కు రెడీ అవుతోంది భారత్. ఓటమి అనేది లేకుండా తుదిపోరు వరకు వచ్చిన టీమిండియా.. ఆఖరాటలోనూ నెగ్గి కప్పుతో స్వదేశానికి పయనమవ్వాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క. గ్రూప్ దశలో మన చేతిలో చావుదెబ్బ తిన్న కివీస్.. ఇప్పుడు ఫుల్ కసి మీద ఉంది. మనకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. అందుకే గౌతీ-రోహిత్ ద్వయం త్రిశూల వ్యూహంతో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మూడు వైపుల నుంచి న్యూజిలాండ్ను చుట్టుముట్టి.. కీలక ఆటగాళ్లపై ఎదురుదాడికి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ను ప్రధాన అస్త్రాలుగా వాడనున్నారని వినిపిస్తోంది.
అతడే ప్రధాన అస్త్రం..
న్యూజిలాండ్ ప్రధాన బలం ఫీల్డింగ్. ఆ జట్టు ఈజీగా 20 నుంచి 30 పరుగుల వరకు స్టన్నింగ్ ఫీల్డింగ్తో కాపాడుకుంటుంది. దీన్ని అధిగమించడానికి కోహ్లీని వాడనున్నాడట రోహిత్. గ్యాప్స్లో నుంచి బంతుల్ని తరలిస్తూ అలవోకగా స్ట్రైక్ రొటేషన్ చేసే బాధ్యత అతడికి అప్పగించారట. కోహ్లీతో కలసి అయ్యర్ కూడా ఇదే పని చేయనున్నాడట. ఆసీస్పై నాకౌట్లో దుమ్మురేపిన రాహుల్కు పించ్ హిట్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడట హిట్మ్యాన్. అటు బౌలింగ్లో వరుణ్ను కీలక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నాడట. గ్రూప్ స్టేజ్లో కివీస్పై 5 వికెట్లు తీసినందున డేంజరస్ బ్యాటర్లు వచ్చిన ప్రతిసారి అతడితో బౌలింగ్ చేయించాలని చూస్తున్నాడట.
ఊహలకు అందని రీతిలో..
కేన్ విలియమ్సన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ సమయంలో వరుణ్తో అటాక్ చేయించేందుకు రెడీ అవుతోందట భారత్. బౌలింగ్లో వరుణ్, అక్షర్తో అటాక్ చేయిస్తూ వాళ్లపై ఫోకస్ చేసేలోపే షమి, హార్దిక్ను దింపి కన్ఫ్యూజ్ చేసే ప్లాన్లో ఉందట టీమ్ మేనేజ్మెంట్. బ్యాటింగ్లో కోహ్లీ-రోహిత్ కంటే రాహుల్, అయ్యర్, అక్షర్ను ఫ్రంట్ లైన్లో ఉంచి దాడి చేయాలనేది గంభీర్ ప్లాన్ అని సమాచారం. ఇలా జూనియర్లు, సీనియర్లతో మూడు వైపుల నుంచి దాడి చేయిస్తూ.. అవసరమైన సమయంలో రోకో జోడీ బరిలోకి దిగి మిగిలిన కథ ముగిస్తారని వినిపిస్తోంది. అంచనాలకు అందని రీతిలో బౌలింగ్-బ్యాటింగ్ కాంబినేషన్లు, ఫీల్డింగ్ చేంజెస్ ఉండేలా పథకాలు రచిస్తున్నారట. ఇవి గానీ వర్కౌట్ అయితే రోహిత్ సేనను కప్పు కొట్టకుండా ఎవరూ ఆపలేరని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
ఫైనల్ మ్యాచ్ టై అయితే.. ఏం చేస్తారు..
ఫైనల్స్లో వర్షం పడితే విన్నర్ ఎవరు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి