Rahul Meeting With PM Modi: 88 నిమిషాలు చర్చ... సెంట్రల్ ప్యానల్ నియామకాలపై మోదీతో విభేదించిన రాహుల్
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:49 PM
రాహుల్ గాంధీ పీఎంఓ కార్యాలయానికి ఒంటిగంట సమయానికి చేరుకున్నారు. 1.07 నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానంతరం అత్యున్నత పదవులకు మోదీ ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్టు రాహుల్ పేర్కొంటూ లిఖితపూర్వకంగా తన అసమ్మతి నోట్ను అందజేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర సమచార కమిషన్ (CIC), కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) వంటి పారదర్శక సంస్థలకు కీలక నియామకాలు ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని ప్యానల్ బుధవారంనాడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah)తో పాటు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొన్నారు. సుమారు 88 నిమిషాల పాటు సమావేశం జరిగింది.
రాహుల్ గాంధీ పీఎంఓ కార్యాలయానికి ఒంటిగంట సమయానికి చేరుకున్నారు. 1.07 నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానంతరం అత్యున్నత పదవులకు మోదీ ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్టు రాహుల్ పేర్కొంటూ లిఖితపూర్వకంగా తన అసమ్మతి నోట్ను అందజేశారు. కాగా, ప్రస్తుతం సీఐసీలో ప్రధాన సమాచార కమిషనర్తో పాటు 8 కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30,838 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి ముందు సీఐసీగా ఉన్న హీరాలాల్ సామరియా 65 ఏళ్లు పూర్తికావడంతో గత సెప్టెంబర్ 13న పదవీ విరమణ చేశారు. 2023 నవంబర్ 6న ఆయన సీఐసీగా నియమితులయ్యారు. కాగా, మే 21న సీఐసీ పోస్టుకోసం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో 83 అప్లికేషన్లు వచ్చినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులు తెలిపారు. సీఐసీలోని సమాచార కమిషనర్ ఖాళీలకు 161 అప్లికేషన్లు అందినట్టు ప్రభుత్వం తెలిపింది.
నిబంధనల ప్రకారం, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ప్రధాని సారథ్యంలోని కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి.
ఇవి కూడా చదవండి..
శశిథరూర్కు వీరసావర్కర్ అవార్డు... తీసుకోవడం
జర్మనీ పర్యటనకు రాహుల్.. లీడర్ ఆఫ్ పార్టీయింగ్ అంటూ బీజేపీ విమర్శ, ప్రియాంక కౌంటర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి