Omar Abdullah: అంపశయ్యపై 'ఇండియా' కూటమి.. ఒమర్ అబ్దుల్లా
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:31 PM
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2023లో ఇండియా కూటమి కోసం నితీశ్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. నితీశ్ను ఇండియా కూటమి కన్వీనర్గా చేసే విషయమై తాము అప్పట్లో జరిగిన సమావేశంలో చర్చించామన్నారు.
న్యూఢిల్లీ: విపక్ష 'ఇండియా' కూటమి ప్రస్తుతం వెంటిలేటర్పై ఉందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఉన్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kuamr)ను మళ్లీ ఎన్డీయేకు తాము (INDIA allianae) నెట్టేసినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల తర్వాత కూటమి పరిస్థితి మరింత దిగజారిందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఒమర్ తెలిపారు.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2023లో ఇండియా కూటమి కోసం నితీశ్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. నితీశ్ను ఇండియా కూటమి కన్వీనర్గా చేసే విషయమై తాము అప్పట్లో జరిగిన సమావేశంలో చర్చించామన్నారు. నితీశ్ కూడా అందులో పాల్గొన్నట్టు చెప్పారు. ఆయన పేరును తాము గట్టిగానే ప్రతిపాదించామని, అయితే మరో నేత వీటో పవర్తో ఉన్నారని తెలిపారు.
ఆర్జేడీతో కొద్దికాలం భాగస్వామిగా ఉన్న నితీశ్ కుమార్ జేడీయూ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీయేలో చేరింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వీప్ సాధించింది. ఆర్జేడీ, కాంగ్రెస్ కేవలం 35 సీట్లకే పరిమితమయ్యాయి. దీనిపై ఒమర్ మాట్లాడుతూ, ఇండియా కూటమి కోలుకుంటోందని అనుకుంటున్న దశలో బిహార్ ఫలితాలతో పరిస్థితి మళ్లీ దిగజారిందన్నారు. బిహార్లో జేఎంఎం పార్టీని మహాగఠ్బంధన్లో చేర్చుకోకపోవడాన్ని నిలదీశారు. రేపు జేఎంఎం కూటమి జాతీయ స్థాయిలో 'ఇండియా' కూటమిని వీడినట్లయితే తప్పెవరిదవుతుందని ఒమర్ ప్రశ్నించారు. 'ఇండియా' కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఒకటిగా పనిచేయాలని, లేనట్లయితే రాష్ట్రాలకే పరిమితమైన నిర్దిష్ట కూటములుగా మిగిలిపోతాయని అన్నారు. ఇండియా కూటమిగా మనం చెప్పుకోవాలనుకుంటే మరింత సమగ్రతను సాధించాల్సి ఉంటుందని సూచించారు.
బీజేపీపై ప్రశంసలు
బిహార్ ఎన్నికల్లో బీజేపీ పోరాటపటిమపై మాట్లాడుతూ, ఎన్నికలపైనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నట్టు బీజేపీ పోరాటం సాగిస్తే, ఇండియా కూటమి తమకేమీ పట్టింపులేదనట్టు వ్యవహరించిందని చెప్పారు. ఎన్డీయే తరహాలో 24X7 ఎన్నికలు, ప్రచారానికి తాము కట్టుబడి లేమన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరూ వీటో చేయలేరు: జైశంకర్
విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి