Share News

Guntur: అసలువి చూపి.. నకిలీవి అంటగడ్తారు

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:53 PM

నకిలీ బంగారం అంటగట్టి కొరిటెపాడుకు చెందిన దంపతులను మోసగించి వారి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని గుంటూరు అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.

Guntur: అసలువి చూపి.. నకిలీవి అంటగడ్తారు

- నకిలీ బంగారం అంట గట్టి, మోసగించిన ముఠాలో ఇద్దరు కర్ణాటక వాసుల అరెస్టు

- తవ్వకాల్లో బంగారం దొరికిందంటూ మాయమాటలు..

- రూ.12 లక్షలు మోసపోయిన గుంటూరు దంపతులు

గుంటూరు: నకిలీ బంగారం అంటగట్టి కొరిటెపాడుకు చెందిన దంపతులను మోసగించి వారి నుంచి రూ. 12 లక్షలు తీసుకున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని గుంటూరు అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి పరిధిలో గల విట్లాపురం పంచాయతీకి చెందిన గుత్తి జంబునాద్‌ (ఏ4), వెంకటేష్‌ (ఏ5)గా వారి గుర్తించారు.గుంటూరు(Guntur)లో మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల డీఎస్పీ అరవింద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....


ఈ నెల 15న గుంటూరులోని కొరిటెపాడు ప్రాంతానికి చెందిన దంపతులకు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి(Ballari) జిల్లా తిమ్మాలాపురం గ్రామం విట్లాపురం పంచాయతీకి చెందిన ఐదుగురు వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి, ఒక రాంగ్‌ కాల్‌ చేసి తమ వద్ద తవ్వకాల్లో దొరికిన బంగారం ఉందని, తక్కువ రేటుకు విక్రయిస్తామని నమ్మించారు. సుమారు నెల రోజుల పాటు బాధితులతో మాటలు కలిపి మొదటగా అసలైన చిన్న బంగారపు ముక్క ఇచ్చారు. బాధిత దంపతులు వాటిని పరీక్షించుకోగా అసలై బంగారమేనని తేలింది. దీంతో బాధిత దంపతులు వారి మాటలు నమ్మారు.


కాగా బాధిత దంపతులను కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి పిలిపించుకుని అక్కడ వారి వద్ద నుండి రూ.12 లక్షల నగదు తీసుకుని వారికి రాగి - జింక్‌ మిశ్రమంతో కూడిన అర కేజీ నకిలీ బంగారు ముక్కలను ఇచ్చారు. ఇంటికి వచ్చి బాదితులు వాటిని పరీక్షించుకోగా అవి రాగి - జింక్‌ మిశ్రంతో కూడిన నకిలీ బంగారమని తెలిసి కంగుతిన్నారు. అప్పటికే నిందితులు ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసి ఆచూకీ అందకుండా పోయారు. దీంతో బాధితులు తమకు జరిగిన మోసానికి సంబంధించి అరండల్‌ పేట పోలీస్‌ ేస్టషన్‌లో ఫిర్యాదు ఇవ్వగా, కేసు నమోదు చేశారు.


pandu2.2.jpg

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు వెస్ట్‌ డీఎస్పీ అరవింద్‌ పర్యవేక్షణలో అరండల్‌ పేట సీఐ ఆరోగ్య రాజు, ఎస్సై సుబ్బారావు, పోలీస్‌ సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణ జరుగుతుండగానే వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టుగా ఈ ముఠా మరొకరిని మోసగించేందుకు యత్నిస్తున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. కొరిటెపాడుకు చెందిన బాధిత దంపతులకు తెలిసిన వారినే ఈ ముఠా ఇదే తరహాలో మోసం చేసేందుకు యత్నించింది.


వారు ఈ విషయాన్ని బాధిత దంపతులకు చెప్పగా వారి ద్వారా విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వారి ద్వారా ఈ ముఠాకు పోలీసులు ట్రాప్‌ వేశారు. వారిని గుంటూరుకు పిలిపించి ఇరువురు నిందితులు జంబునాద్‌, వెంకటేష్‌లను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ. ఏడు లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. నిందితులంతా కర్నాటకలోని విట్లాపురం గ్రామానికి చెందిన ఐదు మంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు ఇరువురు నిందితులు వెల్లడించారు. కాగా మిగిలిన ముగ్గురు నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్‌ చేయనున్నట్లు డీఎస్పీ అరవింద్‌ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2025 | 12:53 PM