Pawan Kalyan: పులివెందుల్లో ప్రజా తీర్పు వెలువడింది : పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Aug 14 , 2025 | 09:01 PM
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల విజేతలకు అభినందనలు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యయుత పోటీ ద్వారా అసలైన ప్రజా తీర్పు వెలువడిందని ఆయన స్పష్టం చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా మండలాల్లో విజయం సాధించిన లతారెడ్డి, ముద్దుకృష్ణా రెడ్డిలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదని గుర్తు చేశారు. నామినేషన్ వేద్దామనుకున్న వారిపై వైసీపీ నేతలు దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఎన్నికల్లో ఏకగ్రీవాలకు వెసులుబాటు ఉంది కానీ.. ఏకపక్షంగా సాగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పు రాకపోవచ్చని పవన్ కళ్యాణ్ వివరించారు. పులివెందులలో పోటీ ఉండటం వల్లే.. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తమ తీర్పు వెల్లడించారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఇప్పటి వరకూ ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేసుకుంటూ వచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో పోటీకి ఆస్కారం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల తరవాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు నచ్చినవారికి ఓటు వేసుకోగలిగామని పులివెందుల ఓటర్లు చెప్పారని తెలిపారు.
ఎన్నికల నిర్వహణ మూలంగా పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజా తీర్పు స్పష్టంగా వెలువడిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రక్రియ ఇష్టం లేని వైసీపీ ప్రతి దశలో కవ్వింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు. ఎన్నికలు జరగటం నచ్చక, అసహనంతో ప్రభుత్వంపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు సంయమనంతో వ్యవహరించారని చెప్పుకొచ్చారు. పోలింగ్ సందర్భంలో హింసకు తావు లేకుండా చర్యలు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు ఆయన అభినందనలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ