Prasanna Kumar Controversy: ప్రత్యేక ప్రసన్నం.. రిటైరైన మర్నాడు నుంచే ఉద్యోగం
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:41 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎల్ ప్రసన్నకుమార్కు 2024లో ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్లో పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. అయితే ఇప్పుడు సదరు అధికారి అధికారిక విధుల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
» అధికారిక ఉత్తర్వులు లేకుండానే విధులు
» ఓఎస్డీ నియామకం జరిగిందంటూ కేక్ కటింగ్లు
» ఎన్టీఆర్ కమిషనరేట్లో చర్చనీయాంశంగా మారిన అధికారి వ్యవహారం
(ఆంధ్రజ్యోతి-విజయవాడ): సాధారణంగా ఉద్యోగులు పదవీ విరమణ చేశాక ఇంటికే పరిమితమవుతారు. ఏదైనా పని ఉంటేనే కార్యాలయం మెట్లు ఎక్కుతారు. కొన్ని శాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన వారిని ప్రత్యేకాధికారులు (ఓఎస్టీ)గా నియమించుకుంటారు. ప్రభుత్వం ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ అయిన తర్వాత మాత్రమే ఓఎస్టీ హోదా వస్తుంది. అటువంటిది ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్లో (NTR Police Commissionerate) ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఓ అధికారి ఉద్యోగ విరమణ చేసిన మర్నాడు నుంచే అధికారిక విధుల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
ఆయనే విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ (AVL Prasanna Kumar), దీనిపై కూటమి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుందంటూ పోలీసు వర్గాలో చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎల్ ప్రసన్నకుమారుకు 2024లో ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్లో పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. సెలవు కావడంతో కమిషనరేట్ అధికారులు కమిషనర్ కార్యాలయంలో శనివారమే వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత ట్రాఫిక్ విభాగంలో పనిచేసే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు కలిసి ఆదివారం మరో వీడ్కోలు కార్యక్రమాన్ని బెంజిసర్కిల్లో ఉన్న ప్రైవేట్ పంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన వంతుగా కొంత మొత్తాన్ని ప్రసన్నకుమార్ ఇచ్చారు.
మాటే అధికారికమా
ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అన్ని శాంతిభద్రతల పోలీస్స్టేషన్లకు అధికారులు దాతల విరాళాలతో డ్రోన్లు సమకూర్చాడు. అదేవిధంగా ట్రాపిక్ విభాగానికి ఆరు డ్రోన్లను సమకూర్చారు. జూలై 31వ తేదీన కమిషనరేట్లో నిర్వహించిన ఇన్స్పెక్టర్లకు డ్రోన్లను అందజేసే కార్యక్రమానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సాంకేతికంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రసన్నకుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రజంటేషన్ పూర్తయిన తర్వాత డీజీపీ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆగస్టు నెలాఖరున ఉద్యోగ విరమణ చేసినా తిరిగి ఓఎస్డీగా నియమిస్తామని డీజీపీ ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ప్రసన్నకుమార్ తనను ఓఎస్డీగా నియమించడం ఖాయమన్న భావనలో ఉన్నారు. ప్రసన్నకుమార్ని తిరిగి ట్రాఫిక్లో ఓఎస్డీగా నియమించాలని కమిషనర్ కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన ప్రసన్నకుమార్ ఎలాంటి అధికార ఉత్తర్వులు లేకుండానే సోమవారం నుంచి విధుల్లో పాల్గొన్నారు. పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు రోజూ కమిషనరేట్ పరిధిలో ఉన్న డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ కాన్ఫరెన్లో ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్ విభాగంలో ఏమేమి చేస్తున్నారో ఆ చర్యలను సీపీకి వివరించడం గమనార్హం. ఇది పూర్తయ్యాక అధికారిక వాహనంలో మంగళగిరి వెళ్లారు. డీజీపీని కలిసి తిరిగి ట్రాఫిక్ కాంప్లెక్స్కు చేరుకున్నారు.
పోలీసు శాఖ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు ఎసీఆర్ (యాన్యువల్ కాన్పిడెన్షియల్ రిపోర్టు) ఉంటుంది. అధికారులు తమ కింద పనిచేసే సిబ్బందికి ఈ ఏసీఆర్ను రాయాల్సి ఉంటుంది. అది కార్ బదిలీపై వెళ్లినా, ఉద్యోగ విరమణ చేసినా దిగువన ఉన్న సిబ్బంది ఈ ఏసీఆర్ రాయించుకుంటారు. ఇలా ఏసీఆర్ రాయించుకోవడానికి వెళ్లిన ఇన్స్పెక్టర్లతో తనకు ఓఎస్టీ నియామకం జరుగుతుందని, డీజీపీ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. వెంటనే ఇన్స్పెక్టర్లు ఆగకుండా అప్పటికప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 22 నుంచి నిర్వహించే దసర శరన్నవరాత్రి మహోత్సవాల క్యూలైన్లను పరిశీలించడానికి జిల్లా అధికారులు ఇంద్రకీలాద్రి వెళ్లారు. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే ప్రసన్నకుమార్ విధుల్లో పాల్గొనడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు
మాదక ద్రవ్య రహిత ఏపీ మా లక్ష్యం: అనిత
For More AP News And Telugu News