Sandhya Rani Coffee Controversy: కాఫీ గోలతో విలువైన ప్రశ్నలు రాకుండా చేశారు.. వైసీపీపై మంత్రి ఫైర్
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:15 PM
శాసన మండలికి వచ్చిన వారు కాఫీ, టీల కోసం దెబ్బలాడటం సిగ్గుచేటంటూ మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వైసీపీ కాఫీ, టీ కోసం చేసిన గొడవ వల్ల మండలిలో ప్రశ్నలే రాకుండా పోయాయని మంత్రి మండిపడ్డారు.
అమరావతి, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాఫీ రగడపై మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Minster Gummadi Sandhyarani) స్పందించారు. కాఫీ, టీల కోసం మండలిలో వైసీపీ దెబ్బలాడటం దౌర్భాగ్యమని మండిపడ్డారు. శాసనసభలో ప్రశ్నించేందుకు వైసీపీకి అవకాశం ఉన్నా రావట్లేదని.. మండలికి వచ్చిన వారు కాఫీ, టీల కోసం దెబ్బలాడటం సిగ్గుచేటంటూ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (శనివారం) వైసీపీ కాఫీ, టీ కోసం చేసిన గొడవ వల్ల మండలిలో ప్రశ్నలే రాకుండా పోయాయని అన్నారు. ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న ఎస్టీలకు పట్టాలు ఇచ్చే విలువైన ప్రశ్నను వైసీపీ తమ కాఫీ గోలతో సభ ముందుకు రాకుండా చేశారని ఫైర్ అయ్యారు.
వైసీపీ చంపిన చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇవ్వటాన్ని తప్పుపట్టడం దుర్మార్గమన్నారు. వివేకా కూతురు సునీతను వైసీపీ వదిలేసినట్లుగా.. ప్రాణాలు కోల్పోయిన తమ కార్యకర్తల బిడ్డల్ని వదిలేయలేమని మంత్రి స్పష్టం చేశారు. ‘వైసీపీ హయాంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం తీసి తనిఖీ చేశారు. ఓ మహిళా సభ్యురాలి హ్యాండ్ బ్యాగ్ తనిఖీ చేయటం ప్రోటోకాలా’ అంటూ గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాగా... ఈరోజు కాఫీ విషయంలో మండలిలో రగడ చోటు చేసుకుంది. అసెంబ్లీకి ఒకలా... మండలిలో ఒకలా కాఫీలు, భోజనాలు ఇస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అయితే దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ శాసనసభ, మండలిలో కాఫీ, భోజనాల విషయంలో తేడా ఏం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ సభ్యులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఛైర్మన్ మోషేన్ రాజు సభను కాసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్
వాళ్లకు ఒకలా... మాకు ఒకలానా... మండలిలో ‘కాఫీ’పై వార్
Read Latest AP News And Telugu News