Pulivendula: పులివెందులలో ధర్మానికి, అధర్మానికి సమరం: మంత్రి సవిత
ABN , Publish Date - Aug 09 , 2025 | 07:26 PM
పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.
కడప: పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. రేపు(ఆదివారం) ప్రచారం చివరి రోజు కావడంతో నువ్వా.. నేనా అన్నట్లు వైసీపీ, టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే టీడీపీ ఆధ్యర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, ఎంపీ సీఎం రమేష్, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు. ఏపీలో ఇప్పుడున్న పింఛన్ విధానం ప్రపంచంలోనే లేదని సవిత పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలను జగన్ రెడ్డి గత ప్రభుత్వం హత్యలు చేసిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం మాత్రం వారిని అభివృద్ధి చేస్తోందని చెప్పుకొచ్చారు. పులివెందులకు ఇప్పటివరకూ నీళ్లిచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదే అని స్పష్టం చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి కోసం.. సొంత నియోజకవర్గంలోని పులివెందుల ఎర్రచెరువుకు జగన్ రెడ్డి నీళ్లు ఇవ్వలేదని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మండిపడ్డారు. ఎర్రచెరువుకు త్వరలో నీళ్లు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎర్రచెరువుకు నీళ్లించ్చేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో దందాలు, అక్రమాలు తప్ప అభివృద్ధి జరగలేదని బీటెక్ రవి విమర్శలు గుప్పించారు.
పులివెందుల ఉపఎన్నిక టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. నిన్నటి వరకు ఇది వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి పెద్దఎత్తున టీడీపీలో చేరికలు జరుగుతున్నాయి. రోజూ చేరికలతో టీడీపీలో జోష్ నిండుతోంది. మరోవైపు ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని వైసీపీ చూస్తోంది. మాజీ సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీ అవినాష్రెడ్డి ఇతర వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతోంది జడ్పీటీసీ ఉపఎన్నిక మాత్రమే. మరొక్క ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంటుంది. అయినా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా మారుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి