Viveka murder case: వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ..
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:51 AM
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. జస్టిస్ M.M.సుందరేశ్, జస్టిస్ N.K. సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కడప ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ.. సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు. హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.
సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లూథ్రా సుప్రీంకు విన్నవించుకున్నారు. నిందితులు సాక్ష్యులను బెదిరించడమే కాకుండా.. సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సునీత దంపతులతోపాటు సీబీఐ అధికారి రామ్సింగ్పైనా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. దస్తగిరి జైలులో ఉన్నప్పుడు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి బెదిరించాడని ఆరోపించారు. అవినాష్ రెడ్డే వివేకా హత్యలో మాస్టర్ మైండ్ అని ధర్మాసనానికి తెలిపారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటికి రావాల్సి ఉందని సిద్ధార్థ లూథ్రా తన వాదనలు ముగించారు.
అనంతరం సీబీఐ తరఫు వాదనలను సీబీఐ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వినిపించారు. నిందితుల బెయిల్ రద్దు చేయాలని సుప్రీంను కోరారు. నిందితులను కాలపరిమితి లేకుండా జైలులో ఉంచడం మంచిది కాదని కానీ హత్య జరిగిన తీరు చూస్తే... నిందితులకు 5 సంవత్సరాలు జైలు శిక్ష చాలా తక్కువే అనిపిస్తోందని తెలిపారు. కేసులో ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని చెప్పారు. ముందు గుండె పోటు అని తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. నిందితులు హత్య అని తెలియకుండా అన్ని విధాలా ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇవన్ని దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని స్పష్టం చేశారు. నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఫోటోలతో సహా... ఉన్నాయని కోర్టుకు వివరించారు. జైలుకు వెళ్లి.. అక్కడ కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. అవన్ని నిరూపితం అయ్యాయని స్పష్టం చేశారు. అన్ని సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ కోర్టుకు అందించారు.
ఈ మేరకు తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని ధర్మాసనం సీబీఐని నిర్దేశించింది. దర్యాప్తులో నిందితులను కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో కూడా చెప్పాలని పేర్కొంది. ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న విషయాన్నీ చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా కుమార్తె, అల్లుడు సునీతా రెడ్డి, నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణాధికారి రామ్సింగ్పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని వెల్లడించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 9(సెప్టెంబర్ 9)కి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
విద్యుత్ షాక్తో తండ్రీకొడుకుల మృతి