Share News

PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:19 PM

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ స్వీకరించారు. ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మాధవ్‌కు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు.

PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్
PVN Madhav

విజయవాడ: బీజేపీ ఆంధ్రప్రదేశ్ (AP BJP) రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (PVN Madhav) స్వీకరించారు. ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మాధవ్‌కు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాధవ్‌కు బీజేపీ జాతీయ, ఏపీ నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఉద్గాటించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపిన పీసీ మోహన్‌కి ధన్యవాదాలు తెలిపారు. నేడు ఎంతోమంది బీజేపీ కోసం పని చేస్తున్నా.. తన మీద నమ్మకం ఉంచినందుకు పార్టీ హై కమాండ్‌కి కృతజ్ఞతలు చెప్పారు పీవీఎన్ మాధవ్.


ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. తమ కుటుంబం, బీజేపీ వేర్వురు కాదని స్పష్టం చేశారు. పురంధేశ్వరి సారథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను సాధించామని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా పురందేశ్వరి నేతృత్వంలో పార్టీ బలోపేతం అయ్యిందని ఉద్ఘాటించారు. ఏపీలో బీజేపీ క్రియాశీలకంగా పనిచేస్తోందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు భరోసా కల్పించారని చెప్పుకొచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు పురందేశ్వరి మరిన్ని సేవలు అందించనున్నారని అన్నారు. సోము వీర్రాజు బీజేపీ బలోపేతం కోసం తన ఇల్లు కూడా మరచిపోయి ఏపీ మొత్తం తిరుగుతూ పని చేశారని గుర్తుచేశారు. ఎంతోమంది పెద్దలు బీజేపీలో ఉన్నారు... వారి సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని ఉద్ఘాటించారు పీవీఎన్ మాధవ్.


పదవి కీలకమైన బాధ్యత..

‘ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కీలకమైన బాధ్యత. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంలో నాకు అధ్యక్ష పదవి రావడం ఆనందంగా ఉంది. ఏపీలో బీజేపీ శక్తివంతంగా ఉందని కేంద్ర పెద్దలు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వనరులు ఉన్నాయి. వాటిని పూర్తిగా వినియోగించుకుని ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి అందిస్తున్న సహకారం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తప్పకుండా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ఎంతోమంది పెద్దలు అధ్యక్షులుగా బీజేపీ బలోపేతం కోసం‌ పని చేశారు. వారి స్పూర్తితో నేను బీజేపీని ఏపీలో అధికారంలోకి తెచ్చే దిశగా పని చేస్తాను’ అని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.


బీజేపీ ఒక సిద్దాంతం కోసం పని చేస్తోంది: పీసీ మోహన్

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వాహకుడిగా బెంగుళూరు ఎంపీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పీసీ మోహన్ వ్యవహారించారు. ఈ సందర్భంగా పీసీ మోహన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఒక సిద్దాంతం కోసం పని చేస్తోందని పీసీ మోహన్ స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు అయినా, జాతీయ అధ్యక్షుడు అయినా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకుంటామని తెలిపారు. నాయకులు, కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలకు తమ పార్టీలో విలువనిస్తామని.. కానీ కాంగ్రెస్‌లో అంతా వన్‌మ్యాన్ షో కనిపిస్తోందని విమర్శించారు. ఏఐసీసీకి నచ్చిన నేతలను మాత్రమే కాంగ్రెస్‌లో అధ్యక్షులని చేస్తారని అన్నారు. కాంగ్రెస్‌లో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఉండదని చెప్పుకొచ్చారు. కేడర్‌తో సంబంధం లేకుండా కాంగ్రెస్‌లో రాష్ట్ర, జాతీయ అధ్యక్షులని ఎంపిక చేస్తారని తెలిపారు. బీజేపీలో ప్రజాస్వామ్యం ప్రకారం అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని పీసీ మోహన్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

రెండు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..

For More AP News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 08:32 AM