Share News

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

ABN , Publish Date - May 26 , 2024 | 05:45 AM

ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.

CM Revanth Reddy: ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం

  • సమష్టి కృషితోనే తెలంగాణ సాకారం

  • ఇది ప్రతిబింబించేలా ఉత్సవాలు

  • రాష్ట్రమిచ్చిన సోనియాను పిలుస్తున్నాం

  • ప్రజాపాలన చాటేలా ప్రభుత్వ చిహ్నం

  • లెఫ్ట్‌, టీజేఎస్‌ నేతలతో రేవంత్‌

హైదరాబాద్‌, మే 11(ఆంధ్రజ్యోతి): ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ఇదే విషయమై తగు సూచనలు ఇవ్వాల్సిందిగా టీజేఎస్‌ అధినేత కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్యలను ముఖ్యమంత్రి కోరారు. సమష్టి కృషితోనే రాష్ట్రం ఏర్పాటైందన్న ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఏకీభవించిన వారు వేడుక నిర్వహణకు తమ వంతు సూచనలు చేశారు.


సోమవారం ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను గెలిపించాల్సిందిగా ఆ నియోజకవర్గ ఓటర్లకు ఉమ్మడిగా పిలుపునిచ్చేందుకు ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో కోదండరాం, కూనంనేని సాంబశివరావు, ఎస్‌.వీరయ్యలతో పాటు సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీజేఎస్‌ నేత విశ్వేశ్వర్‌రావు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులూ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపైనా వారితో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.


తెలంగాణ రాష్ట్రం ఒక్కరి పోరాటం వల్లనే ఏర్పాటైనట్లుగా ఇప్పటి వరకూ చిత్రీకరణ జరిగిందని, వాస్తవానికి సమష్టి కృషి వల్లనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి అన్నారు. అమరవీరులు, ఉద్యమకారులు... రాష్ట్ర ఏర్పాటులో అనేకులు తమవంతు పాత్ర పోషించారని చెప్పారు. వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. యూపీఏ చైర్‌పర్సన్‌ హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకపాత్ర వహించిన సోనియాగాంధీని ఈ వేడుకల్లో సన్మానించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆమెను ఆహ్వానించినట్లు తెలిపారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులనూ ఈ వేడుకకు ఆహ్వానించాలనుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ చిహ్నం.. రాచరిక పాలనను ప్రతిబించేట్లు కాకుండా ప్రజా పాలనను ప్రతిబింబించేలా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిపాదనలో ఉన్న కొన్ని నమూనాలను చూపి మార్పులు, చేర్పులపై అభిప్రాయం తీసుకున్నారు. సీఎం వెల్లడించిన అభిప్రాయాలతో ఏకీభవించిన నేతలు.. తమ వంతు సూచనలు చేశారు.


  • తీన్మార్‌ మల్లన్నను గెలిపించండి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీజేఎ్‌సల పిలుపు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను గెలిపించాలంటూ కాంగ్రెస్‌, మిత్రపక్షాల నేతలు నియోజకవర్గ ఓటర్లకు ఉమ్మడిగా పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహేష్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రె్‌సకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. తీన్మార్‌ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సాంబశివరావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం బతకాలంటే తీన్మార్‌ మల్లన్న గెలవాలన్నారు. కాంగ్రె్‌సను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలని సూచించారు. కోదండరాం మాట్లాడుతూ, బీజేపీ, బీఆరె్‌సకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మద్దతుగా నిలిచామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు కాంగ్రె్‌సకు ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ, విద్యాధికులు ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని తీన్మార్‌ మల్లన్నను గెలిపించాలన్నారు.

Updated Date - May 26 , 2024 | 05:45 AM