Share News

Telangana: మల్లారెడ్డికి మరో భారీ షాక్.. 15 మంది జంప్..!

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:06 PM

Hyderabad: మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌ను వీడారు 15 మంది కార్పొరేటర్లు. దీంతో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్..

Telangana: మల్లారెడ్డికి మరో భారీ షాక్.. 15 మంది జంప్..!
MLA Mallareddy(File Photo)

హైదరాబాద్, జులై 10: మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌ను వీడారు 15 మంది కార్పొరేటర్లు. దీంతో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. అయితే, ఈ 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. మొన్న జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైసవం అయ్యాయి. అదే బాటలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా హస్తగతం కానుంది.


మరోవైపు పార్టీ మారుతున్న కార్పొరేటర్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి నిలువరించలేకపోయారు. వారిని అడ్డుకోలేక చేతులెత్తేశారు. ఈ వ్యవహారంలోనే మంగళవారం నాడు జరిగిన ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్‌లో రసాభాస చోటు చేసుకుంది. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని.. బలవంతంగా, బెదిరింపులకు పాల్పడి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.


ఇదిలాఉండగా.. ఎమ్మెల్యేలే పార్టీలు మారుతున్న వేళ కార్పొరేటర్లు సైతం తామెంత అనుకుంటూ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతోంది. గత కొంత కాలంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇటీవలి కాలంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లారెడ్డే వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 10 , 2024 | 12:17 PM