Share News

KTR: ఎందరినో చూశాం.. మీరెంత..??.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 20 , 2024 | 01:48 PM

వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: ఎందరినో చూశాం.. మీరెంత..??.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్.. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని చెప్పిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారారని విమర్శించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ ఎన్నో చూసిందని.. అలాంటి వాళ్లందరూ మఖలో పుట్టి పుబ్బలో పోయేవాళ్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజలపక్షమేనని స్పష్టం చేశారు.

"తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావ్. తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా.. మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తున్నందుకా..? కాంగ్రెస్ బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిసిపోతాయి. రేవంత్ రక్తం అంతా బీజేపీదే. ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారారు. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నారు. స్విట్జర్లాండ్ లో అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారు. అదానీ గురించి రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి మాత్రం ఆదానీ కోసం అర్రులు చాస్తున్నారు."

- కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్


కరెంట్ బిల్లులు కట్టవద్దు...

ఈ జనవరి నెల కరెంటు బిల్లులను ఎవరూ కట్టవద్దని కేటీఆర్ సూచించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మహాలక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలన్నారు. హామీలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజూ పొత్తు లేదన్న కేటీఆర్.. భవిష్యత్ లోనూ ఉండదన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొంది, కేంద్రమంత్రి పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ఈ ఐదేండ్లల్లో ఏం చేశారో చెప్పాలని ఆక్షేపించారు. కేసీఅర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే కిషన్ రెడ్డి మాత్రం సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో లిప్ట్ లను జాతికి అకింతం చేశారని ఎద్దేవా చేశారు.

కార్యకర్తలకు కృతజ్ఞతలు..

హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీనే అని వెల్లడించారు. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు రైతుబంధు అందడం లేదు.. మహిళలకు ఇస్తామన్న రూ.2500 రావడం లేదు.. కాంగ్రెస్ ఇచ్చినవి ఆరు గ్యారంటీలు కాదు 420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. వివిధ డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వెంటాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - Jan 20 , 2024 | 01:48 PM