Share News

IND vs ENG: సెంచరీలతో రోహిత్, గిల్ విధ్వంసం.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:45 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ దుమ్ములేపారు. సెంచరీలతో పెను విధ్వంసం సృష్టించారు. 13 ఫోర్లు, 3 సిక్సులతో 154 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీని పూర్తి చేసుకోగా.. 10 ఫోర్లు, 5 సిక్సులతో 137 బంతుల్లో గిల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

IND vs ENG: సెంచరీలతో రోహిత్, గిల్ విధ్వంసం.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా

ధర్మశాల: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma), వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) దుమ్ములేపారు. సెంచరీలతో పెను విధ్వంసం సృష్టించారు. ఫోర్లు, సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లను కుమ్మేశారు. 13 ఫోర్లు, 3 సిక్సులతో 154 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీని పూర్తి చేసుకోగా.. 10 ఫోర్లు, 5 సిక్సులతో 137 బంతుల్లో గిల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 12వ సెంచరీ కాగా.. గిల్‌కు నాల్గోవది. ఈ సిరీస్‌లో ఇద్దరికీ రెండో సెంచరీ కావడం గమనార్హం. ఇద్దరు వరుస ఓవర్లలో సెంచరీలను పూర్తి చేసుకున్నారు. టామ్ హార్ట్‌లీ వేసిన 58వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి రోహిత్ శర్మ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. షోయబ్ బషీర్ వేసిన 59వ ఓవర్ రెండో బంతిని బౌండరీ బాది గిల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రోహిత్, గిల్ సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఇద్దరి మధ్య భాగస్వామ్యం కూడా అజేయంగా 160 పరుగులకు చేరుకుంది.


భారత్ స్కోర్ 104/1గా ఉన్న దశలో జత కట్టిన రోహిత్, గిల్ రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోర్‌ను 250 పరుగులు దాటించడంతోపాటు ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. రెండో రోజు ఆట మొదటి సెషన్‌లో ఇంగ్లీష్ బౌలర్లను రోహిత్, గిల్ ఉతికి ఆరేశారు. తొలి సెషన్‌లో ధాటిగా వీడిన వీరిద్దరు 129 పరుగులు రాబట్టారు. దీంతో తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌కు ఒక వికెట్ కూడా దక్కలేదు. 135/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా రోహిత్, గిల్ సెంచరీలతో తొలి సెషన్‌లో సత్తా చాటింది. రెండో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి భారత జట్టు 264/1 స్కోర్ చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(102), శుభ్‌మన్ గిల్(101) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై భారత జట్టు 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా మొదటి రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 218 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఓపెనర్ జాక్ క్రాలే(79) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ టాప్ 6లో ఐదుగురు బ్యాటర్లను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవే పెవిలియన్ చేర్చాడు. 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా ఒక వికెట్ తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IND vs ENG: కెప్టెన్‌గా మైలురాయిని చేరుకున్న రోహిత్ శర్మ.. అన్ని ఫార్మాట్లలో..

IND vs ENG: సచిన్, కోహ్లీ, రోహిత్ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలుకొట్టిన జైస్వాల్



Updated Date - Mar 08 , 2024 | 11:51 AM