Share News

Maharashtra: మహారాష్ట్రలో రసవత్తర పోరు.. సుప్రియా సూలే వర్సెస్ సునేత్ర పవార్..

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:36 AM

రానున్న లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Maharashtra: మహారాష్ట్రలో రసవత్తర పోరు.. సుప్రియా సూలే వర్సెస్ సునేత్ర పవార్..

రానున్న లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు అజిత్ పవార్ చేసిన ప్రసంగం ఈ అనుమానాలకు ఊతం ఇస్తున్నాయి. సుప్రియా సూలేపై ఆయన భార్య సునేత్ర పవార్‌ పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే సునేత్రా పవార్ ఇప్పటికే బారామతి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించడం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో సుప్రియా సూలే 2009 నుంచి వరసగా మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. అంతకు ముందు 2006 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

అజిత్ పవార్ భార్యగానే కాకుండా బారామతిలో సామాజిక సేవ చేయడం ద్వారా సునేత్రా పవార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఎన్విరాన్‌మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా స్థాపకురాలిగా ఉన్నారు. స్వదేశీ విద్యా సంస్థ విద్యా ప్రతిష్ఠాన్‌కు ట్రస్టీగా పనిచేస్తున్నారు. బారామతిలో సునేత్ర పవార్ చేసిన సేవను తెలుపుతూ ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అది చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ ఏర్పాటు రాబోయే ఎన్నికల కోసమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


కాగా.. శరద్ పవార్ 1967, 1972, 1978, 1980, 1985, 1990లో బారామతి స్థానం నుంచి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. 1984, 1996, 1998, 1999, 2002లో బారామతి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి రెండు సార్లు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో బారామతి లోక్‌సభ స్థానానికి గత మూడు దఫాలుగా సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 11:37 AM