Share News

IndiGo: పొగమంచు ఎఫెక్ట్.. గౌహతికి వెళ్లాల్సిన ఇండిగో విమానం దారి మళ్లింపు

ABN , Publish Date - Jan 13 , 2024 | 10:58 AM

పొగమంచు ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ముంబై నుంచి గౌహతి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. సదరు విమానాన్ని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ల్యాండ్ చేశారు.

IndiGo: పొగమంచు ఎఫెక్ట్.. గౌహతికి వెళ్లాల్సిన ఇండిగో విమానం దారి మళ్లింపు

పొగమంచు ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ముంబై నుంచి గౌహతి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. సదరు విమానాన్ని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ల్యాండ్ చేశారు. ముంబై నుంచి గౌహతి వెళ్లాల్సిన 6ఈ5319 నంబర్ గల ఇండిగో విమానం దట్టమైన పొగమంచు కారణంగా ఢాకాలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ల్యాండ్ అయింది. విమానం దారి మళ్లింపుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కోపాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ కూడా విమానంలోనే ఉన్నారు. ఇంఫాల్‌లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో సూరజ్ సింగ్ పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.


కాగా దట్టమైన పొగమంచు కారణంగా ఇప్పటికే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో విమానాలు కూడా చేరడం ఆందోళన కల్గిస్తోంది. మరోవైపు ఉత్తర భారతదేశాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవే కావడం గమనార్హం. తీవ్ర చలిగాలుల కారణంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు వాతావరణ శాఖ శనివారానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారానికి కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కాగా జనవరి 16 వరకు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు, చలిగాలులు జనవరి 16 వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Jan 13 , 2024 | 10:58 AM